పుట:Kavijeevithamulu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

కవి జీవితములు



కాక యతనికిఁ బూర్వుండును భారతకవులలో నొక్కండును నగునెఱ్ఱా ప్రెగ్గడయు నీతిక్కనసోమయాజి నాంధ్రకవి బ్రహ్మగానే వినుతించెను. ఇట్లిర్వురు ప్రామాణికకవులచే నిర్ణయింపఁబడినవిధంబున తిక్కనసోమయాజి యాంధ్రకవిబ్రహ్మయే యని నిర్ణయించెదము. ఇటులనే యనన్యసాధ్యము లగుభాగవతరహస్యార్థములం దెలిసి వాని నాంధ్రీకరించినపోతరాజు, ఆంధ్రవేదవ్యాసుం డనియును, వసిష్ఠ, విశ్వామిత్ర, బ్రహ్మఋషుల యద్వైతతత్త్వార్థముల గ్రంథరూపములుగ నాంధ్రంబునఁ బ్రకటించిన మడికిసింగనకవియు, పరశురామపంతులలింగమూర్తిగురుమూర్తియుఁ గ్రమంబుగ నాంధ్రవశిష్ట, విశ్వామిత్రఋషు లనియును, నితరపురాణాదులం దెనిఁగించినశ్రీనాథాదికవు లాంధ్రగౌతమాదిఋషు లనియు వర్ణించి చెప్పెదము. ఇట్టిఋషికల్పు లగునాంధ్రకవులసహాయముననే యీవఱకు వేదాభ్యాసాధికారులు గాని స్త్రీశూద్రులును, సంస్కృత భాషాభ్యసనాశక్తు లగునాంధ్రద్విజులును తరణోపాయము నంది యుండి రనుటకు సందియము లేదు. ఇఁక ముందు దేశభాషలే ప్రబలఁగ సంస్కృతము పరిక్షీణింపఁగ వేదశాస్త్రాభ్యాసము లేక యాంధ్రు లందఱును నీపై నాంధ్రగ్రంథములే వేదకల్పములుగఁ జదువుదు రనుదాని కొకసందియమును నుండదు. కావున లోకోపకారు లగునాధునికపండితు లందఱును బైకవులగ్రంథములలోనితత్త్వము నేకముఖము చేసి సంగ్రహగ్రంథములం జేసి యుంచెదరుగాక.

శ్రీనాథునితాతంగూర్చి.

భారతకవుల వృత్తాంతము వ్రాయుచు శ్రీనాథునితాతంగూర్చిన కథ వ్రాయుట కెడయయ్యెను. అతనింగూర్చిన పద్యములలో నతఁడు సముద్రతీరమున నొప్పుకాల్పట్టనమున కధీశ్వరుం డని శ్రీనాథునిచేఁ జెప్పంబడియె. ఈకాల్పట్టణముయొక్క తావు ప్రస్తుతము ద్యోతకము కాక యున్నది. దానిం దెలియుట కతనిచేత రచితమైనపద్మపురాణ సంగ్రహకావ్యములో నేమైన నాధార ముండునేమో? అని దానింగూర్చి విచా