పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కథలు - గాథలు

నరీలు కూడా ఇక్కడికి వచ్చి మతప్రచారం చెయ్యడం ప్రారంభించారు.*[1] వింత దుస్తులు ధరించి గొడ్డుమాంసం తింటూ మద్యపానం చేస్తూ కులభేదాలు పాటింపక మాల మాదిగలతో కలిసిమెలిసి తిరిగే యీ విజాతీయులనూ , వీరిలాగే ఉండేవారినీ మనవాళ్లు 'పరంగీ' లని అనేవారు. పోర్చుగీసువారు ఎక్కువగా ఈ దేశంలో సముద్రతీరాన్ని ఉండే పరవరులనే పల్లెకారులలో క్రైస్తవ మత ప్రచారం చేశారు. ఈ పరంగీలకూ , దేశీయ స్త్రీలకూ పుట్టిన సంకరజాతి ఒకటి త్వరలోనే బయలుదేరింది.

వెంకటపతి దేవరాయ మహారాయల కాలంనాటికి విజయనగర సామ్రాజ్యములో చాలాచోట్ల పోర్చుగీసువారు స్థిరపడ్డారు. మన దేశరాజులు మొదటినుంచి సర్వమతాలవారిని సమానంగా చూసే సహనబుద్ది కలవారుగనుక రాయలవారు పోర్చుగీసువారి క్రైస్తవ మత ప్రచారానికి ఆటంకాలు కలిగించకపోవడమేగాక వారి క్రైస్తవమత


  1. జెస్సూటమిషనరీలు - సొసైటీ ఆఫ్ జీసస్ అనే రోమను క్యతలిక్కు క్రైస్తవ మత ప్రచార సంఘానికి చెందిన సన్యాసులు. వీరిని మనదేశీయులు "ఫాదరీ" లనేవారు. ఈ సంఘం 1539 లో స్థాపించబడి పోర్చుగల్లు స్పెయిను రాజ్యముల అధ్వర్యంకింద దేశదేశాలలో క్రైస్తవ సన్యాసుల మఠాలను స్థాపించి అతి తీవ్రమైన మతప్రచారం సాగించింది. ఈ సంఘంలోచేరిన జెస్సూటు మిషనరీలు కొంతకాలం నియమంగా మతవిద్య నభ్యసించి, కాంతాకనకములను వర్జించి బ్రహ్మచర్యవ్రతమవలంబించి క్రైస్తవమత ధర్మాలను త్రికరణాశుద్దిగా నాచరించే దీక్షను వహించి సన్యాసాశ్రమం స్వీకరించేవారు. ఇటలీదేశంలో రోమనునగరంలో నున్న క్రైస్తవమత జగద్గురువ్లైన 'పోప్ ' గారి అధికారానికి లోబడి ఈ జస్సూటుల మఠాలు పనిచేసేవి. క్రైస్తవసంఘంలోని ప్రోటెస్టెంటులు పోపుగారి అధికారాన్ని ధిక్కరించినప్పుడీ జెస్సూటులు పోపుగారికి కుడిభుజంగా నిలిచి పనిచేశారు. ఈ సంఘం వారు బలవంతులై క్రమక్రమంగా లౌకిక వ్యవహారాలలోనూ రాజకీయాలలోనూ పాల్గొంటూ ధనసంపాదనకోసం వర్తక వ్యాపారాలలో ప్రవేశించినందువల్ల ఈ సంఘములో కొన్ని దురాచారాలు ప్రబలినవి మతప్రచారంలో పేరుకొన్న అన్యాయ పద్దతులు కూడా అవలంబించారు. మన దక్షిణహిందూదేశంలో పడమటి సముద్రతీరాన్ని పొర్చుగీసు వర్తకుల రేవుపట్టణమైన గోవానగరంలో జెస్సూటుమఠం ఒకటి 1542 లో స్థాపించబడగా ఇక్కడ మతప్రచారం ప్రారంభమైంది