పుట:Kasiyatracharitr020670mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర: తృతీయ ముద్రణం - పీఠిక

ములుగా ప్రకటించబడి ఆ కాలంనాటి హిందూదేశచరిత్రను ప్రజల స్థితిగతులను గూర్చిన ప్రమాణగ్రంథంగా పూజింపబడుతూ వున్నది. మన వీరాస్వామయ్యగారి గ్రంధం ఆగ్రంథాని కేవిధంగాను తీసికట్టుకాదు. సందర్భానుసారంగా హెబరు గారి గ్రంథంలోనుండి కొన్ని సంగతు లీగ్రంధంలో అక్కడక్కడ ఉదాహరించారు.

పూర్వముద్రణం అచ్చుప్రతులలో వదిలివేయబడి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో వున్న వ్రాతప్రతిలోని విశేషాంశాలను కొన్నింటిని సందర్భానుసారంగా వుదాహరించాను.

వీరాస్వామయ్యగారి పర్యటనమును తెలుపగల ఒక హిందూదేశ పటమును దీనిలో చేర్చారు. శ్రీ వీరాస్వామయ్యగారియెక్కయు, ప్రజాసేవయందు వీరికి తోడ్పడిన వీరి మిత్రులైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారు, వెంబాకం రాఘవాచర్యులుగారు, జార్జి నార్టనుగార్ల యొక్కయు చిత్రపటాన్ని కూడా దీనిలో చేర్చారు.

ఈగ్రంథాన్ని మళ్ళీ యిప్పుడు ముద్రించడంలో పూర్వ ముద్రణపు మూలగ్రంధంలో మార్పులు ఏమీ చేయక యథాతథంగానే అచ్చువేయించాను. అయితే పాఠకుల సౌకర్యంకోసం గ్రంధాన్ని ప్రకరణాలుగా విభజించి, విషయం మారినప్పుడల్లా పేరాలుగావిడదీసి, వాక్యాలు సులభంగా అన్యయంకావడానికి మధ్య కామాలు, మొదలైన గురుతులున్నూ, వాక్యాలచివర ఫుల్ స్టాపు చుక్కలున్నూ వుంచినాను. అందువల్లను చరిత్రాంశాలు వివరణలుగల ఫుట్ నోట్సువల్లను పూర్వ ముద్రణంలో 328 పుటలున్న గ్రంధం ఈముద్రణంలో 374 పుటలకు పెరిగింది.

కృతజ్ఞత.

కాశీయాత్ర చరిత్ర అచ్చు వేయించడానికి పూర్వముద్రణపు గ్రంధం కోసం చాలారోజులు ప్రయత్నించినా దొరకలేదు. పుస్తకం దగ్గరవున్న ఇద్దరు పెద్ద మనుష్యులు యిస్తామని ఇచ్చారుకారు. ఆఖరికి వేటపాలెం సరస్వతీ నికేతనం గ్రంధాలయంలో ఒక ప్రతి వుందని తెలియగా దాన్ని నా మిత్రులైన శ్రీ పిశిపాటి సీతాకాంతం గారు స్వయంగా వెళ్ళి తెచ్చిపెట్టారు. దానిలో కొన్నిచోట్ల అక్షారాలు చిరిగివున్నాయి. దాని కొక ప్రతి వ్రాసుకొని దానినిబట్టి ఈపుస్తకాన్ని అచ్చువేయిస్తుండగా రాజమహేంద్రవరంలో శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి దగ్గర యింకొక ప్రతి వున్నట్లు తెలిసింది. దాన్ని నామిత్రులు శ్రీనిట్టల భవానిశంకర శాస్త్రిగారు తెచ్చిపెట్టారు. ఆప్రతినిబట్టి అచ్చుపడిన భాగాన్ని మిగతా గ్రంథాన్ని సవరణ చేశాను.

పాత ప్రతిలో వున్న వీరాస్వామయ్యగారి బొమ్మకు శ్రీ నారాయణసింగుచౌహణ్ గారు ఫోటోతీశారు. దానినిబట్టి ఆంధ్రపత్రికాధిపతులు శ్రీ శివలెంక శంభుప్రసాదు గారు బ్లాకు తయారుచేయించి యిచ్చారు. వీరాస్వామయ్యగారి యాత్రామార్గాన్ని తెలిపే దేశపటానికికూడా వారే బ్లాకు తయారుచేయించి యిచ్చారు