పుట:Kasiyatracharitr020670mbp.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

తృతీయ ముద్రణము

పీఠిక

భారతదేశ చరిత్రను గురించీ ప్రజల స్థితిగతులను గురించీ తేట తెనుగులో జాబులుగాను, దినచర్యగాను రచింపబడిన యీ చరిత్రగ్రంథము తెనుగు వాజ్మయంలో అపూర్వమైనది. ఇది అందరూ చదవలసిన పుస్తకం. ఇది చిరకాలం కిందటనే అనగా 1838 లో నొకమాటు 1869 లో నింకొకమాటు అచ్చు పడిందిగాని మళ్ళీ అచ్చుపడలేదు. అందువల్ల ఈ పుస్తకంయొక్క ప్రతులు ఇప్పుడు చదవడానికైనా ఎక్కడా దొరకడంలేదు. ఏమారుమూలనైనా తలవని తలంపుగా ఒక ప్రతి దొరికినా దానిలోని పుటలు తిప్పితేనే నుసి అయిపోయేటంత పాతబడి పెళుసెక్కి వున్నాయి. వీరాస్వామయ్యగారు 1832 ఆ ప్రాంతంలో సి. పి. బ్రౌను దొరగారికి వ్రాయించి పంపిన పుస్తకం వ్రాతప్రతి యొకటి చెన్నపట్టణం ఓరియంటల్ మాన్యూస్క్రిప్ట్సు లైబ్రరీలో ఉందిగాని, అది చదవడానికి వెళ్లి కొన్నాళ్ళు ఉండాలి. అంతే కాకుండా అచ్చు పుస్తకానికీ దానికీ కొన్ని తేడాలు కూడా వున్నాయి. అందువల్ల ఈగ్రంథం మళ్ళీ అచ్చు వేయడం చాలా అవసరమైంది.

పుస్తకం రచింపబడిన నాటికీ నేటికీ మనదేశ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. అందువల్ల అప్పట్లో వీరాసామయ్యగారు తన కాలంనాటి వారందరికీ తెలిసిన సంగతులే యని విపులంగ వ్రాయక సూచించి వదిలిన రాజకీయ సాంఘిక చారిత్రక అంశము లనేకములు ఇప్పుడు విప్పిచెప్పితేనే గాని అర్థంకావు. ఉదాహరణానికి తిరుపతి దేవస్థానంవల్ల కుంపినీవారికి సాలున లక్షరూపాయల ఆదాయం వస్తున్నదని ఈ గ్రంథంలో వ్రాసివున్నది. ఆ కాలంలో మన ధర్మాదాయాలన్నీ కుంపినీవారే స్వయంగా పరిపాలించే వారనిన్నీ భోగములు, అర్చనలు కలెక్టర్లే చేయించే వారనిన్నీ, మిగిలిన సొమ్ము కుంపినీఖజానాలో చేరే దనిన్నీ ఆ కాలంనాటి చరిత్ర చదివితేనే తప్ప తెలియదు. ఇలాంటొ చరిత్రాంశా లన్నింటికీ తగిన వివరణములు, తబ్సిలు, సంపాదించి ఫుట్‌నోట్సుగా వ్రాశాను.

1824-1826 మధ్య కలకత్తాలో కుంపినీవారి కొలువులో ప్రధాన క్రైస్తవ మతాధికారిగా నుండిన బిషప్ హెబరుదొర భారతదేశంలో పర్యటనం చేసి తాను చూసిన సంగతులను తన దినచర్యలోను తన భార్యకు స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలలోను వ్రాసియున్నాడు. అది బిషప్ హెబర్సు జర్నల్ అని మూడు సంపుట