పుట:Kasiyatracharitr020670mbp.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నడవవచ్చును. రామన్నపేటలో వొక గొప్పతోట యింట్లో దిగినాను. యీ మచిలీబందరు బస్తీలో 22 పేటలు కలిగివున్నది. వొక్కొక్క పేటను పూర్వమందు లక్ష్మెకటాక్షము కలిగిన పురుషులు తామై కలగచేసినారు గనుక ఆపేటలలో వచ్చుబడిబాడిగెలను పేటలు కలగచేసిన వారి వంశస్థులు నూరారు రూపాయలవంతున సుఖోపాయముగా యిప్పట్లో ప్రతిమాసమున్ను అనుభవింపుచున్నారు. ఈ బస్తీ లోగడ తురకలది. హయిదరాబాదు కింద వున్న అధికారస్థుడు యిక్కడికి తాను నవాబు అనిపించుకొని యీ రాజ్యాన్ని ఆక్రమించినాడు. ఆ స్వామి ద్రోహము వారి వంశస్థులను కుంఫిణీవారికింద పించను తీసుకొని యిప్పట్లో వుండేటట్టు చేసినది.

పూర్వకాలము మొదలుగా యీ బస్తీ సర్వాధికారుల నివాసముగా వుంటూ రావడముచేతనున్ను, యిప్పట్లోనున్ను వుత్తరఖండం ప్రొవింషియల్ కోరటులో జిల్లాకోరటు కలకటరు కచ్చేరి మమ్మిస్సెర్యాటు ఆఫీసు సహితముగా కొంత దండు వసించివుంటూ రావడంచేతనున్ను, కాండ్రేగులవారు మొదలయిన కొందరు జమీందారులు సాహుకారులు వర్తకులున్ను వుండుటచేతనున్ను బస్తీ చాలాగా శోభించివున్నది. రాజవీధులు బాగా విశాలముగా వున్నవి. యిండ్లు బయిట చూచేటందుకు చిన్నవిగా అగుపడ్డా లోపలి ఆవరణాలు విశాలముగా కట్టివున్నారు. లోముంగిళ్ళుమాత్రము కొంచపరచి కట్టివున్నారు. సమస్ పదార్ధాలున్ను సమస్తపనులు చేయగల మనుష్యులున్ను దొరుకుదురు. శ్రీకాకొళము వదిలిన వెనక బాడిగెకు బండ్లు యీ బస్తీలొ దొరకడము కష్టము. భూమి వుప్పుకలిసిన రేగడి. నీళ్ళవసతి లేదు. దూరమునుంచి యీ బస్తీకి మంచినీళ్ళు తెచ్చుకోవలసినది.


వీరాస్వామయ్యగారు బందరులో జిల్లాజడ్జిగా నుండిన ఆంధ్రభాషోదారకులగు చార్లెస్ ఫిలిప్ బ్రౌను గారిని దర్శించారు గాని యీ పుస్తకములొ ఆ సంగతి వ్రాయలేదని బ్రౌనుగారు స్వదస్తూరితొ వ్రాత ప్రతి 423 పుటలో రిమార్కువ్రాసినారు. వీరాస్వామయ్యగారు చెన్నపట్టణము చేరిన తరువాత బ్రౌనుగారికి వ్రాసిన యింగ్లీషు వుత్తరము వ్రాతప్రతి చివర అంటించబడియున్నది. వీరాస్వామయ్యగారిని బందరుపుర వాసులు 14 రోజులు అక్కడ వుంచారు.