పుట:Kasiyatracharitr020670mbp.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యున్నారు. రత్నమయముగా మూడుశిరోభూషణములు మూడు బింబములకు ధరించివున్నవి.

నిత్యము యేడు భోగ్యపదార్ధములు నివేదన మవుచున్నవి. వాటిలో ప్రధమద్వితీయాలు యేమంటే బాలభోగ్య మొకటిన్ని కిచ్చిడి భోగ్యమొకటిన్ని యీ రెంటిలోనే విశేషపదార్ధాలు చెరడముగాని తతిమ్మా భోగ్యమునంతా అన్నము పప్పుకూరలు చారు పులుసు పరమాన్నము వడలు అతిరసాలు మొదలయిన పిండివంటలున్ను చేరి నివేదమవుచున్నది. బాల భోగ్యానకు దూదుపూరీ అని పాలమీగడతో వొక దినము పూరీచేస్తారు. అది అపూర్వముగా తోచినది. మిరపకాయలకు బదులు మిరియాలు వాడతారు. హారతికి పచ్చకర్పూరము వాడుతున్నారు. ఉదయకాలమందు దంతధావనసేవయున్ను అర్ధరాత్రిలో బడాశృంగారపు సేవయున్నుముఖ్యములు. నైవేద్యమయ్యేవరకు ప్రసాదాలు నియమము కల పండాల అధీనముగా వుంచున్నవి. నైవేధ్యానంతరము జాతిహీనుల అధీనమయి అందరికి వారు తెచ్చి యిస్తూ వుంటారు. వంటశాలలో పాచకులు తప్ప యితరులు పోకూడదు.

జ్యేష్ఠశుద్ధ పున్నమనాడు గర్భగృహములోనించి మూర్తులను వెలిప్రాకారములో వుండే అభిషేక మంటపానకు నడిపించి తీసుకుని వచ్చి జ్యేష్ఠాభిషేక మంటపములో సాయంకాలము దాకా వుంచి రాత్రి మళ్ళీ నడిపించి గర్భగృహము వద్దికి తీసుకొనిపోయి మరుసటి అమాస్య వరకు తెరకు లోపల యెవరికిన్ని దర్శనము లేకుండా శయనావసరముగా మూర్తులను వుంచి పెట్టుతారు. యీపక్షము యావత్తు కిరాతక వంశస్థుల ఆరాధనతో మూర్తులుంటున్నవి. పండాలుకూడ చూడడము లేదు. జ్యేష్ఠాభిషేక మంటపము బహువున్నతముగనుక ఆ అభిషేక దినము సాయంకాలము వరకు వూళ్ళో యెదటి వీధులలో వుండే వారికంతా స్వామిదర్శనము అవుతూవుంచున్నది. యీదినపు యాత్రనున్ను రధయాత్రనున్ను పతితపావనయాత్ర అని యిక్కడివారు చెప్పుచున్నారు. జ్యేష్ఠాభిషేకానంతరమువచ్చే అమావాశ్యమీది పాడ్యమినాడు ప్రతిసంవత్సరమున్ను చేసే క్రొత్తరధాలు మూటినిన్ని సింహ