పుట:Kasiyatracharitr020670mbp.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిరిజాపూరు దొరలు యిచ్చిన ప్యానుపోట్రులను యిక్కడి దొరలు కాయముచేసి వేరే ప్యానుపోట్రులు తాము ఇచ్చి కాశిదాకా కూడావచ్చేటట్టు బరక్రదాసు అనే ఒక పోలీసు బంట్రౌతును నా తయినాతీచేసి జూసీనరాయిలో ఫరవానాకు వ్యతిరిక్తముగా నా మూట ముల్లెలను శొధించి పెరిమిట్టు మనుష్యులను కొలువు తీసివేసేటట్టు నిశ్చయముచేసినారు. వారున్ను భగత్సృష్టితోచేరినవారయి తద్వారా నా సహోదరు లయినందున వారికి నావల్ల హింసకావడము యుక్తము కాదనిన్ని క్రోధము పాపకారి అనిన్ని యీశ్వరుడు నాబుద్ధికి తోపింపఛేసిన వాడయి నాకుండా ఆదొరలను మళ్ళీ ప్రార్ధించబడేటట్టు చేసి వారి జీవనాలు కాపాడినాడు.

యిక్కడ వేణీదానము పెనిమిటి సహితముగా వచ్చిన స్త్రీలున్ను పితృసహితముగా వచ్చిన వివాహముకాని కన్యలున్ను చేల్యవలసినది. యీ వేణీదాన మనగా జడ కత్రించి దాన మియ్యడము ముఖ్యమా, లేక తల వెంట్రుకలు యావత్తు కత్రించి యియ్యడము ముఖ్యమా అనే వివాదము, మనదేశములో రామానుజ దయాపాత్రము వారున్నూ శ్రీ శైల దయాపాత్రము వారున్ను నాసాగ్రము యేది అని వివాదపడ్డట్టుగా పడి, మనవారు ఏకవాక్యత పడనట్టు వీరున్ను యీ విషయములో ఏకవాక్యత పడక కొందరు స్త్రీలకు జడవేసి కొంతమట్తుకు కత్రించి దానము చేస్తారు; కొందరు తలవెంట్రుకలు యావత్తు కత్రించి యిస్తున్నారు. నేను సమగ్రముగానే దాన మిప్పించినాను.

ముందు కాలాలలో యిక్కడ వచ్చి క్షౌరము చేసుకొని యాత్ర చేయడానికి మనిషికి 7 రూపాయల వంతున దొరతనము చేసేవారు హశ్శీలు పుచ్చుకొనుచు వచ్చినారు. యిప్పట్లో మనిషికి కుంఫిణీవారు ఒక రూపాయ వంతున నిష్కర్షచేసి త్రివేణీ సంగమము ఎక్కడ అవుచున్నదో అక్కడ పాటక్కు అనే ఒక చావడివిడవలి (పూరి)తో కట్టివుంచినారు. ఆ పాటాక్కులో 12 బంట్రౌతులతో ఒక జమీదారుణ్ని ఉంచి యున్నారు. ఆ పాటక్కుకు కొన్ని బారలకు ముందుగా ఒక దారోగా కచ్చేరిని ఉంచుయున్నారు.