పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లెవ్వరో తప్ప పొలాల్లో కాపురమున్నవారే. కౌశికకు (గోదావరి పాయ) ఈవలి యొడ్డుకంటె ఆవలి యొడ్డున నెక్కువగా నున్నాయి. బాడీబందతో (బాగా బురుదగా అడుసులాగా ఉంది అనే భావాన్నిచ్చే జాతీయం) వున్న ఆ కౌశిక మాటిమాటికి దిగడం, వెళ్లడం, అక్కడ పులిచార్ల కుక్కలు కఱవరావడం, ఎవరో వారించడం, ఈలాటి చిక్కులతో ఎట్లో ముప్పది రూపాయిరాల పై చిల్లర వసూలు చేశాను. అంతలో విసుగుపుట్టింది. భోజనంచేసి పరుండడంతోటే ఒక ఆలోచన పుట్టింది. ఈలా తిరిగి ముప్టెత్తుకొనే యెడల సభచేయడం యెందుకు? అసలాయన మంచివాడయినా పినతండ్రిగారి దుర్బోధవల్ల ఆయన ಬುದ್ಧಿ చెడిపోయింది, గంగా సంతర్పణకు ఈవూరు కాకపోతే ఇంకోవూరవుతుంది, ఏలడానికి వూళ్లు లేకపోవచ్చు గాని, యెత్తుకు తినడానికి వుండకపోవు, 'సాహసేలక్ష్మీః' అన్నాడు, అని లేచి, దర్భాసనం కట్టి, నన్ను మిక్కిలిగా ఆదరించుచున్న వీరభద్రయ్యగారి వద్దకు వెళ్లి, నా మనస్సులో వుదయించిన కోర్కె యిట్టిదియని యథార్థం చెప్పి, ఈ సందర్భం కొద్దిరోజులవఱకూ యెవరికీ తెలియనీయవద్దని కూడా ఆయనతో మనవిచేసి, ఇదివఱలో వసూలైన సొమ్మ ముప్పై రూపాయల పై చిల్లరయున్నూ అణాపైసలతో గంగా యమునా చెంబులో పోసికొని, హోరున వర్షం కురుస్తూ వుండగా బయలుదేరి, గ్రామంలోకి వచ్చి కరణంగారిని మామూలుగా దర్శించినట్టే దర్శించి, ఏదో పిచ్చాపాటీ మాట్లాడి, 'అయ్యా, ఈరోజున మధ్యాహ్నము నేను పరున్నప్పుడు నిద్రలో మీ గ్రామములో కేశవ స్వామివారు కలలో కన్పడి, “ఏమిరా! నీ కవిత్వ సంపాదన ప్రస్తుతం మరమ్మత్తగుచున్న నా ఆలయా