పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డవుతాడని ధర్మశాస్త్రాలు యెందుకు వ్రాసేయో కాని, నా అభిప్రాయం అప్పుడు కూడా పవిత్రత్వం కలగదనే. పడవ యొక్కేము. కంకర రాళ్లవలెనే మనుష్యులున్నూ దానిమీద వున్నారు. అంతే కాని యెండకు గాని వానకుగాని ఏమీ ఆచ్ఛాదనం లేదు. అయినా క్రొత్త దేశం, క్రొత్త ప్రకృతి చిత్రాలు చూడడం మొదలైన కారణాలచేత కొంత ఆనందంగానే వుంది ఎండ కాస్తున్నప్పటికీ దగ్గర గుడ్డగొడుగు కొంత ఆ బాధలేకుండా చేసింది. అంతలో యొండ బాధ దానంతట అదే తగ్గింది.

ఈతకు సార్థక్యం

ఇంతలో కొన్ని చిక్కులు. నేను గ్రహణివ్యాధితో కాశీనుండి బయలుదేరినానని యిదివఱకే వ్రాసియున్నాను. త్రోవలో అది తగ్గుటకు సాధన మేమున్నది? పైగా మేము తినే ఆహారము దాన్ని హెచ్చు చేసేదేగాని తగ్గించేది కాదు. ఇక దాన్ని తట్టుకోవడానికి ఆధారము పడుచుతనం తప్ప వేఱులేదు. కొంచెం నల్లమందు వేసికొందామంటే, అదిమాత్రం యెంతసేపు ఆపుతుంది? పడవ స్టీమరు వెనుక కట్టబడ్డది. దాన్ని మనకోసం అప్పుడప్పుడు వడ్డుకు పట్టమనడానికి మనమున్నచోట నియామకులులేరు. ఔరా దురవస్థ ఏమి చేయాలి? విషయం రసాభాసమైననూ వ్రాయవలసి వ్రాస్తున్నాను. మటౌకలాగు తలవకండి. చిన్నప్పుడు నేర్చికొన్న యీత అప్పుడు కొంత పనికి వచ్చింది. మృచ్ఛకటికలో శర్విలకుడుగాడు యజ్ఞోపవీతానికి సార్ధక్యం చెప్పినట్లు," నేను అప్పుడు ఈతకొట్ట నేర్చియుండు, అని చదువు