శాస్రులుగారి కృపవల్లనే తెలిసికోగలిగాను. ఈ కారణంచేత, కాశీలో శ్రీ సుబ్రహ్మణ్యశాస్రులవారి వద్ద పరిభాషేందుశేఖరంలో అదివఱకు విన్న తరువాయి నుంచి, అనగా యదాగమపరిభాష వద్దనుంచి మొదలు పెట్టి కౌముదితోపాటు దానిని కూడా చదువుతూ వుండేవాడను. చదువు దేశంలోకన్న విశేషంగా జరగడం లేదుగాని, కాశీమహాపట్టణములో నివాసము, అనేక చిత్రములు, అనేక ఉత్సవములు, అనేక సభలు, క్రొత్తదేశము, క్రొత్త ఆచారములు, ఇవన్నీ మనస్సును ఆకర్షించి, అక్కడవున్న కాలమంతా బహుచక్కగా, ఉల్లాసంగా జరిగింది. చదువుమాత్రం స్వదేశంలో జరిగినట్టు కాశీలో జరుగదు. అనధ్యయనాల చిక్కు కాశీలో చాలా ఉంది. మాట్లాడితే ఏదో వంక పెట్టి అనధ్యయనం." పండితులేనా, పూర్వకాలంలో ఎప్పుడోగాని నేను కాశీ వెళ్లేటప్పటికి మన దేశంలో, కాశీలో చదివి అక్కడనే పేరు ప్రతిష్టలు పొంది వచ్చినవారు చాలామంది వున్నారు. ఒకటి మాత్రం ఉంది. ఒక్క ప్రదేశంలో అంతమంది, అన్నిశాస్త్రాలలోనూ కావాలంటే మాత్రం దొరకరు. ఏమైనా, మా విద్యార్థిదశ నాటికి కాశీనుంచి వచ్చిన పండితుడంటే వక పెద్దపర్వతం లాగు మా మనస్సుకు తట్టేవాడు. ఈ దేశంలో చదివినవాడంటే వారికన్న యెంత గొప్పవాడైనా మా మనస్సుకు ఎంతో తక్కువగా కనుపడేవాడు. తెలివితేటలు వుండాలి, తగిన గురుశుశ్రూష వుండాలి, వ్యాసంగం వుండాలి; అంతే కాని దేశంలో చదివినా వకటే కాశీలో చదివినా వకటే. అయితే మాత్రం ఇంత విచారణ చేసేదెవరు? కాశీలో యన్ని యేళ్లున్నారంటే, యిన్ని యేళ్లున్నారంటే చెప్పుకొనే మాటలమీద గౌర