పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వించేవారే కాని. పాండిత్యమెట్టిదనే మాట జనసామాన్యానికి అక్కఱ లేదుగదా! ఎవరోవకరు ప్రాజ్ఞతను బట్టి విచారించేవారున్నూ పూర్వకాలమందున్నట్టు ఈ శ్లోకపాదం వల్ల మనము తెలిసికోవచ్చు "కాశీ గమనమాత్రేణ నాన్నంభట్టాయతే ద్విజాః". ఏమైనా, వ్యాకరణానికి కాశీ, తర్కానికి నవద్వీపము," మీమాంసకు దక్షిణ దేశము, వేదానికి కృష్ణాగోదావరీతీరాలు అనాదిగా ప్రసిద్ధి. ఈలా వున్నను, వేద శ్రాతాలు" తప్ప తక్కినవన్నీ కాశీలో మనదేశముకన్న నెక్కువగానున్న వనుటలో నతిశయోక్తిమాత్రం లేదు.

తాంబూలం - భోజనం

నేనప్పుడు చదివికోదలచినది వ్యాకరణం మాత్రమే. దానికి స్వదేశంలోనే బోలెడు గురువులు కలరు. కాశీకి వెళ్లనే అక్కఱలేదు. కాని నేను అనుకున్న తాంబూలపు చిక్కు దేశంలో వదలడం, అందులో మా గురువుగారి వూట్లో వదలడం యెట్లు? అది కాశీలో వదలింది. రోజు వకటి రెండు మూడు సార్లే కాకుండా, ఎన్నిసార్లో తాంబూలం, సురితీ (సున్నము కలిపి నలిపిన పొగాకు) సహితంగా అందఱున్నూ వేస్తారు. ఎవరింటికి వెళ్లినా ముందుగా తాంబూలపు సామాను యెదుటబెట్టిగాని, రెండోమాట మాట్లాడరు." అది ఆ దేశపు ఆచారం, తాంబూలం సంగతి యిట్టిది కదా! ఇక భోజనమో? ఉదయం ఎనిమిదిగంటలు మొదలు రెండుగంటల వఱకున్నూ నిరభ్యంతరంగా సత్రాలున్నాయి ఎనిమిదింటికి రామరాజు (అనంతపురం) సత్రం," పదింటికి తంజావూరు రాణీ సత్రం, పన్నెండింటికి తంజావూరురాజా సత్రం,