88
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
ఒకనాఁడతండు స్త్రీప్రశంశమీద దేవీ ! నీవు సర్వదేశములు తిరుగుచుందువు. సర్వావయవసుందరుల నిందుముఖుల నెందైనంజూచితివా ? కవివర్ణనమేకాని యట్టి స్త్రీలులేరనియే నాయభిప్రాయమని యడిగిన నేనించుక యాలోచించి చిఱునగవుతో మహారాజా ! నాకీ ప్రసంగముతోఁ బనిలేదుకాని మీరడిగితిరి కావునఁ జెప్పుచుంటి వినుండు పాటలీపుత్రనగరమున రతినూపురయను వేశ్యగలదు. దానికిద్దరు కూఁతుండ్రు. వారి యవయవములన్నియు మొలచినట్లు పోసినట్లు దిద్దినట్లున్నవి. చక్కదనం బొక్కటియేకాదు. సంగీతమో ? సరస్వతియైన నంతమాధుర్యముగా వీణఁబాడలేదు. వారి సుగుణంబులు గణనాతీతములు విటులఁదుచ్ఛులుగా జూచుచుందురు. అబ్బబ్బా ! ఆలావణ్యము సురగరుడోరగాదిత్య విద్యాధరాది యువతులకు లేదని రూఢిగాఁ జెప్పఁగలను. ఇప్పుడాలలనలు మురిపెంపు పరువమున సానబట్టిన రతనముల వలె మెఱయుచున్నారు.
నరేంద్రా! నేనవధూతనై నగుదుంగాక. చెప్పవలసినమాట జెప్పకమానను. నీకు వారు తగినవారు. వారికి నీవుదగుదువు. వారితో నిన్ను సంఘటించినప్పుడుగదా పరమేష్టినిఁ జతురాననుండని పొగడ దగినది. అని యూరక నీబిడ్డలఁ జక్కతనముం గొనియాడితిని.
నామాటలు విని యాభూకాంతుడు విస్మితస్వాంతుండై ఏమీ ? వారకాంతలే యంత చక్కనివారు! వారన్యాక్రాంతలైరా! లేదా? చెప్పుమనవుఁడు నేనిట్లంటి దేవా ! పరవశలైన తెరవల యొఱపుమీకడ నేమిటికి నుతింతును ?
వారిప్పటి కెవ్వరిని వరింపలేదు. సరిపడిన పురుషులు దొరకవలదా? గుణాధికులఁ గాని వరింపరు. అని చెప్పినవిని యాభూభర్త తటాలున లేచివచ్చి నాపాదంబులంబడి దేవీ ! నీవు యోగినివయ్యును