చిత్రసేనారతి మంజరులకథ.
79
మంజరి మధుపఝంకార ముఖరితంబగు మంజరీదామంబు హస్తంబునం బూని యడుగులుతడఁబడ వీధిద్వారము దాపునకుంబోయి రెండు చేతులు జోడించుచు భగవంతుని ధ్యానించుచుఁ దటాలునఁగవాటములదెరచినది. అప్పటికిఁజీకటు లంతరించినవి. దెసలు దెల్లబడుచుండెను.
క. మేలిజలతారు రతనపు
శాలువ మై గప్పికొని లసన్ముఖతేజ
శ్శాలి యొకభూసురాత్మజుఁ
డాలోకోత్సవము జేసె నయ్యంగనకున్.
మనోహరరూపలక్షణంబులఁ ప్రకాశించు నవ్విప్రకుమారుం జూచి యపారసంతోష పారావారవీచికలం దేలియాడుచుఁ జంచల దృగంచలంబులతనిపైఁ బ్రసరింపఁజేసినది. ద్వారదేశంబున నిలువంబడి రెప్పవాల్పక తన్నీక్షించుచున్న యాచంచలాక్షింజూచి జగన్మోహనంబగు తద్రూపవైభవంబున కచ్చెరువందుచు నతండు
క. తరుణీరత్నమ ! యీమం
దిర మెవ్వరిదో వచింపు నేనప్పుణ్యా
కరుల యభిదానమును విని
మురిపంబందెదనటన్న ముసిముసినగవుల్ .
వెలయింపుచు నవ్వెలయాలిపట్టి పురుషోత్తమా ! యీయింటి వారు మీకేమియుపకారము జేసిరని పొగడుచుంటిరి? మీరెవ్వరు? ఇందెప్పుడువచ్చితిరి? మీకులశీలనామంబులు వినిపింపుఁడు. పిమ్మట వీరివృత్తాంతము సెప్పెదనని పలికిన నప్పలుకుల కలరుచు నతండు.
సీ. పరమేశ్వరుని యాస్యపం కేరుహంబు సం
భవకారణంబు మావంగడంబు
హిమశైల కన్యకాధీశ వాసంబు కా
శీపురంబనని మాకాపురంబు