384
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
లీలావతి - ఆహా ! నే నామహానుభావులసేవజేసి యెంతకాల మైనదో తిరుగా నీజన్మమున నా కట్టిభాగ్యము పట్టునా ? అని కన్నీరు విడచుచున్నది.
సరస్వతి - దేవీ ! ఘోటకముఖు లీదినమున మిమ్ముఁ దప్పక భర్తతోఁ గూర్తునని చెప్పలేదా ? మఱచితివా ? మీనిమిత్తమై వారు పడినశ్రమయంతయు వినియుఁ బరితపించెద వేమిటికి ? తప్పక మీకు నేఁడు భర్తృసమాగమము కాఁగలదు.
మదయంతి - అక్కా ! సరస్వతీ ! ఆతఁడే కాళిదాసకవిచంద్రుఁడు. ఆహా ! ఆమహానుభావునికథలం జెప్పికొనుటయేకాని దర్శనము సేసియుండలేదు. నేఁడు కృతార్థులమైతిమిగదా !
సరస్వతి - (భోజకాళిదాసకవుల నిరూపించిచూచి నమస్కరింపుచు) అయ్యిరువురు దేవసదృశులు; త్రిభువనవిఖ్యాతయశులు; నావివాహముతగవులో నానృపతికూడ నుండిరఁట.
రత్న పదిక - మాచరిత్రమంతయుఁ జూడకుండఁగనే రచించిన రహస్యవేది అతఁడే కాళిదాసు అయ్యో ! నాభర్త వారిదర్శనము సేయవలయునని యెంతయో కుతూహలపడువారు. ఎందుండిరో తెలియదు. ఏమిజరగునో అని యశ్రువులు విడుచుచున్నది.
సువర్న పదిక - ఈప్రయత్నమంతయు నందులకే కాదా? సంతోషసమయము వచ్చుచున్నది. విచారింపకుము.
సరస్వతి - మనపండితుల దండితనము వింటిరా? మొన్నటి సభలోఁ గాళిదాసకవితోఁ బ్రసంగించుటకుఁ గాలుదువ్విరఁట.
మదయంతి – అది యౌవనమదము తొలిప్రాయమందుండుటచే నట్టిపంకము గలుగును.
మల్లిక - ప్రసంగించిన నెవ్వరు గెలుతురో ?
లీలావతి - మీభర్త లెంతదిట్టలైనను విద్యామహిమచే నతనికి