346
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
మాట కడ్డుసెప్పక యంగీకరించి యావారకాంతలనిరువుర నిక్కడికిఁ దీసికొనివచ్చితిని. వారు చావడిగదిలో నున్నారు. అని యారాజు భార్యకుఁ జెప్పెను.
ఆమాటలు విని మిత్రవింద ఓహో ! మీసాధుత్వము మిక్కిలి కొనియాడఁదగియున్నదిగదా ? విపులునిఁ జేసినపనికి మందలింపక యనుమోదించి యాసుందరుల నిందుఁ దీసికొనివచ్చితిరా ? చాలు; చాలు. ఈవార్తవినిన భోజుండు మిమ్ముఁగూడ నపరాధిగా నెంచి మీపైఁ గత్తికట్టకమానఁడు. మీదుర్నయ మెల్లరకుఁ దెల్లమగును. అదియునుంగాక,
శ్లో॥ కర్తా కారయితాచైవ ప్రేరక శ్చానుమోదకః
సుకృతె దుష్కృతెచైవ చత్వారః సమభాగినః ॥
పుణ్యపాపములు చేసినవాఁడును, జేయించినవాఁడును, బ్రేరకుఁడు, ననుమోదించినవాఁడును సమముగాఁ దత్ఫలమును బంచుకొందురని పెద్దలు చెప్పుదురు. పూర్వ మొకబ్రాహ్మణుఁడు వాచాదోషంబుననే యతిహత్యాపాప మనుభవించె నాకథ నా కొక పండితుం డెఱింగించెఁ జెప్పెద నాలింపుఁడు.
కౌశికునికథ.
కౌశికుండను బ్రాహ్మణుఁడు ఒకనాఁ డొకసన్యాసిని బిక్షకై నిమంత్రించెను. తనకు వాడుకగాఁ బెరుఁగునుం బాలును దెచ్చుచున్న గొల్లదానితో నోసీ ! రేపు మాయింట యతిభిక్ష జరగును. నీకు నిబ్బడిగా సొమ్మిచ్చెదను. నీరుగలుపకుండ గట్టిపెరుఁగు తోడుపెట్టి తెమ్మనిచెప్పి యంపుటంజేసి యాగొల్లది యట్లే మంచిపెరుఁగు ముంతలోఁ దోడుపెట్టి యది గంపలోఁబెట్టి పైన గడ్డ మూతవైచి తెచ్చుచుండెను. గాలిచే నా గుడ్డ పెరుఁగుముంతమూతినుండి తొలంగినది. ఆకసమున నాసమయమున నొకగరుడపక్షి తెల్లత్రాచుం బట్టికొనిపోవుచుండెను. ఆపాము గరళము గ్రక్కినది. ఆవిషము దైవికముగావచ్చి గొల్లదితెచ్చుచున్న