322
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
ఆమాట విని రత్నపదిక కన్నుల నీరునించుచు నయ్యో ! పాప మాతఁడా ? వాని శాపప్రవృత్తినిమిత్తమై నాభర్త యెంతయో విచారించెను. తనపాటు తనకుతెలియక పెరవారింగురించి చింతించెను. అయ్యో ! ఇంక నెన్నినాళ్లిందుందును. చెల్లీ ! సువర్ణపదికా ! వారి విముక్తింగూర్చి నీభర్త యేమనుచుండెను. అనుటయు సువర్ణపదిక నాలుగు దినములలో నన్నియుఁ జక్కపడునని యక్క నోదార్చినది.
వారి సంభాషణములన్నియు విని లీలావతి దత్తునియుదంత మంతకుమున్ను కొంతకొంత వినియున్నదగుట రాజపుత్రికవరించినవాఁడు దత్తుఁడేయని నిశ్చయించి యావృత్తాంత మప్పు డెవ్వరికిం జెప్పినది కాదు.
మఱునాఁ డరుణోదయంబున లేచి చారాయణసువర్ణ నాభులు తత్పురప్రధానదేవాలయగోపురంబున కరిగి తత్కుడ్య భాగంబులు పరీక్షించి సువర్ణనాభాదులు వెనుకవ్రాసిన వ్రాఁతలక్రింద గోనర్దీయుఁడునుఁ గుచుమారుఁడు ధారాపురంబున కరుదెంచినట్లు వ్రాసినవ్రాఁతలఁ జూచిరి. అప్పుడు ప్రభుచిహ్నములతో నున్నవారే తమమిత్రులని నిశ్చయించి వెదకికొనుచుఁ దిన్నఁగా వారివిడిది కరిగిరి.
వారు నివసించియున్న గృహప్రాంగణంబు భేరీపటహాదిమంగళధ్వానములచే ముఖరితం బగుచున్నది. విచ్చుకత్తులం బూని రాజభటులు పారా యిచ్చుచుండిరి. ఆవైభవమంతయును జూచి మిగుల సంతసించుచు వారిరువురుఁ దమరాక ప్రభువులకు నివేదింపుఁడని దౌవారికులఁ గోరికొనిరి. ప్రతీహారులు లోపలికిఁ వోయి బ్రాహ్మణులంట, ఇరువురు విద్వాంసులంట మీదర్శనమునకై వచ్చిరంట, ద్వారదేశమునఁ బ్రతిక్షించియున్నారు. సెలవేయని యడిగిన వారు ప్రవేశపెట్టుఁడని యజ్ఞాపించుటయు రాజకింకరులు వారిం దీసికొనిపోయి ప్రభువులయెదుట నిలిపిరి.
ఓహోహో !! ప్రాణమిత్రులే! అనుధ్వానంబులు నింగి