పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

సాదిమహాకవులతోఁగూడికొని పురబాహ్యోద్యానవనంబున నమరింపఁబడియున్న డేరాలోనికిం జని యావినోదము సూచుచుండెను.

సీ. గొఱ్ఱెవీపున మేటిగుదెగాఁగ రెండుదూ
                 లములు వైచి తదంతరమున నొక్క
    యేనుఁగ నెక్కించి దానిపై రెండుసిం
                 గముల నిల్పి తదగ్రకాయములను
    జేర దూలమువైచి శ్రేణిగా దానిపైఁ
                 బులుల నావులను దుప్పులను నిల్పి
    తచ్ఛిరంబులఁ బెద్దదారువు ఘటియించి
                యుష్ట్రత్రయం బందు నొదుగనిల్పి

గీ. వానిచరమాంగముల వలమైనరెండు
   దూలములువైచి యందుఁ గోతులను మహిష
   ములను భల్లూకములను వర్తులముగాఁగ
   నిలిపి నాట్యము సేయించె లలితఫణితి.

ఆవ్యూహచమత్కారము చూచి విస్మయముచెందుచు నల్లాణుండు ప్రక్కనున్న కాళిదాసకవిం జూచి,

శ్లో॥ కవీంద్ర ! పశ్య మేపోయ మల్పసారోపి ధైర్యయుక్ ।
     వహ త్య శేషజంతూనాం భారంమేరురినాఖిలం॥

కవీంద్రా ! ఈగొఱ్ఱె స్వల్పబలముగలదైనను లోకముల మేరువు పర్వతము ధరించినట్లు ఈమృగముల బరువంతయు మోయుచున్నది. చూచితివా? అనిపలికినవిని కాళిదాసకవి యీక్రిందిశ్లోకమును జదివెను.

శ్లో॥ కిమేషో మేషోయత్సకలమృగ భారంవహతిత
     ద్విచిత్రం త్రైలోక్య స్థిరతర ధురంధారణ పటోః।
     మహారాజశ్రీమన్మకుటతట భాస్వద్వరమణీ
     ప్రభారాజత్పాదాంబుజయుగళ ధారాపురపతెః॥