పురందరపురము కథ.
271
సభ్యులు శోకారావములు వెలయింపుచుండ గోనర్దీయుఁడు హస్తసంజ్ఞచే వారించుచుఁ గొంతువు సవరించుకొని వెఱవకుఁడు. వెఱవకుఁడు. కుచుమారుండు బ్రతికియేయున్నవాఁడు. వినుండు. దైవికముగా నాఁడు పల్లెవాండ్రు వలవైచి వానిం బైకిదీసి తమపల్లెకుఁ దీసికొనిపోయి కాపాడిరి
తరువాతఁ గొన్ని నెలల కతండు చక్కఁబడి యొక రేవులో నావికాధిపతియైయుండఁ గుచుమారుని వివాహవార్త బ్రాహ్మణులు చెప్పిన విని పరివారముతో నే నిందువచ్చుచు దారిలో నతనిం గలిసికొని యథార్థము దెలిసికొని పరితపించుచు నాతనితోఁగూడ నిందువచ్చితిని. ఆపురుషసింహుఁ డీసభలోనే యున్నవాడు. అని తనప్రక్కనున్న కుచుమారుం జూపుచు,
మ. ఇతఁడే నిర్మలశేముషీవిజితవాగీశుండు నానాకళా
ద్భుతపాండిత్యవిశేషసంభృతయశస్త్సోమావృతాశాంతుఁ డూ
ర్జితవిద్వజ్జనవందితాంఘ్రియుగుఁ డుర్వీదేవుఁ డాకారని
ర్జితమారుం డగు కుచుమారుఁడు గుమారీదత్తహారుం డిలన్.
సీ. అఱువదినాల్గువిద్యలు నాఱుశాస్త్రంబు
లును సొంతముగఁ బఠించినఘనుండు
సిద్ధాస్థిలబ్ధవశిత్వమహత్వాప్తి
తనవిద్య మెఱుఁగువెట్టినతపస్వి
వరకళాజితసరస్వతి సరస్వతి వార్త
విని ప్రసంగింపవచ్చినసుబుద్ధి
చిలుకచేతనె కళల్ పలికించి నెఱిమించు
కలికి మెప్పించినలలితమూర్తి
గీ. శంబరునిద్రోహమునఁ జచ్చి శబరకరుణ
మఱల బ్రదికిన విప్రకుమారుఁ డంగ
జితసుమారుఁడు కుచుమారుఁ డితఁడెసుండి !
అరి గురుద్రోహి శంబరుఁ డతఁడుసుండి !