పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యైపోయెను. విధివిధాన మతిక్రమింప విధి కే శక్యముగాదనినచో నితరులమాట జెప్పనేల.

క. చిరకాలజీవియగు న
   ప్పరమతపోధనుని గురుని బలవంతముగా
   శిరమున రాయిడి చంపిన
   దురితాత్ముని కరుదె యవిహితుం బంధింపన్ .

అని యెఱింగించి కాలాతీతమైనంత ననంతరవృత్తాంత మవ్వలి మజిలీయం దిట్లు చెప్పెను.

161 వ మజిలీ.

చారాయణుం డరిగినకొన్ని నెలలకు మల్లిక పుష్పవతియై మనోజ్ఞ తేజంబునం బ్రకాశించుచుండెను. అల్లుఁడు వత్తుననిచెప్పిన మితి దాటిన తరుహత బ్రహ్మదత్తునిభార్య మిక్కిలి పరితపించుచుఁ గాకికూసినఁ జారాయణుఁడు వచ్చునా అని ప్రశ్న మడుగును. పరదేశు లరుదెంచిన నతని వార్త లడుగుచుండును. సంతత మతనిరాకగురించియే చింతించుచు నొకనాఁడు భర్తతో నార్యా ! కులశీలాదులం దెలియక మనము చారాయణునికిఁ బిల్లనిచ్చితిమి. అతండు పుస్తిగట్టి లేచిపోయెను. వానిగ్రామ మేదియో బంధువు లెందున్నారో మనకుఁ దిన్నగాఁ దెలియదు. కేవలము విద్యనునమ్మి పిల్లనీయఁగూడదు. మల్లిక సిగ్గుపెంపునఁ జెప్పదు కాని మాటునఁ గూర్చుండి యేదియో ధ్యానించుచుండును. ఏపేదవానికిచ్చినను నిల్లువదలకుండును. ఇప్పు డేమిచేయఁదగినదని యడిగిన బ్రహ్మదత్తుం డిట్లనియె

చారాయణుండు మహాపండితుండు. ఏమహారాజుసంస్థానములోఁ బూజింపఁబడుచుండెనో. రెండుమూడుదినములలో వచ్చిన లెస్సయే లేకున్న నేను ధారానగరంబున కరిగి యతనివృత్తాంతము దెలిసికొని వచ్చెద, మీరిందుండఁగలరా? అనిచెప్పిన నామె యంగీకరించినది.