250
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
యైదవనాఁడుదయంబున లేవలేక లేచి నలుమూలలు సూచితిని. యోజనదూరములో నొకతోపు కన్నులపండువు గావించినది. యోజనము మునుపు నాలుగుగడియలలో నడుచువాఁడ నప్పుడు సాయంకాలమునకైన నందుఁ జేరఁగలనో లేదో యని యధైర్యము గలిగినది. ఎట్టులోలేచి యడుగులు తడఁబడ నడువసాగితిని. మహాత్మా ! ఆతోట రెండుక్రోశములదూరములోనే యున్నది. జాముప్రొద్దెక్కు నప్పటి కెట్లో దేహ మందుఁ జేర్చితిని. అది భగవంతునిమహిమగాని నాశక్తి గాదు. తృణకాష్టజల సమృద్ధంబైన యాప్రదేశ మొక చిన్నపల్లెగా నున్నది. అందు బ్రాహ్మణగృహ మొక్కటియే యున్నది. నేనప్పు డేదియుం దెలిసికొనఁజూలక నారికేళవృక్షచ్ఛాయములచే నావరింపఁబడి మెత్తనియాస్తరణలచే నొప్పుచున్న యొకయరగుపైఁ బండుకొంటి మేను వివశమైనది.
కొంతసేపటికి నాకుఁ దెలివివచ్చి కన్నులం దెఱచిచూచితిని. నా మొగంబుననీళ్లు చల్లఁబడియున్నవి. పది రెండేఁడులప్రాయముగల యొక బాలిక నాప్రాంతమున నిలువంబడి తాళవృంతముతో విసరుచుండెను. నేను రెప్పలు విప్పుటఁజూచి యాబాలిక ఆర్యా ! దూరమునడచుటచే నలయిక జెందినట్లుంటిరి. వంటయైనది. లేచివచ్చి స్నానముచేసి భుజింపుఁడు. మాతండ్రిగారు వైశ్వదేవముచేసి మీనిమిత్తము వేచియున్నారని పలికినది.
ఆపలుకు లమృతమువలె నాచెవులకు సోఁకినవి. మాటాడనేరక వడగొట్టినది. లేవఁజాలను. దాహమిమ్మని సూచించితిని. అప్పుడా చిన్నది వడిగా లోపలికిఁబోయి యరనిముషములోఁ దలిదండ్రులఁ దీసికొని వచ్చినది. ఆయజమానుఁడు నన్నుఁబిలిచి పలుకకున్న వెఱపుజెందుచు నన్నుఁ బట్టుకొని లేవనెత్తి తనమేనికిఁ జేరవైచుకొని నాలుగుబిందెల చల్లని నీటిచే నన్ను స్నానముచేయించెను. ఆహా ! పోయినప్రాణములు మఱల నాదేహములోఁ బ్రవేశించినవి. చల్లనితేటమజ్జిగ నానోటఁ బట్టిం