పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భైరవునికథ.

233

    కట్టులకై తెచ్చి కడఁబారవైచిన
                  యోషధు ల్గాంచి నిట్టూర్పు విడిచె

గీ. వానినెల్లను గైకొని వాంఛతోడ
    జాలరులఁ గౌఁగిలించి యుత్సాహమంద
    నుతులఁ గావించె నలపురోహితుని బిలిచి
    తెలిసికొని వెండి మిత్రుఁ డొందినశ్రమంబు.

మిక్కిలి పరితపించుచుఁ గుచుమారుని కుపకారముగావించిన బెస్తలగృహంబుల నంత విత్తబహుళంబై యొప్పునట్లు చేసి యతని కన్న ప్రదానాదుల నాదరించిన పురోహితుని బురోహితునిఁగాఁ జేసికొని యటనుండి పరివారసమేతముగాఁ బురందరపురంబున కరిగెనని యెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. అవ్వలికథ పైమజిలీయందుఁ జెప్పం దొడంగెను.

160 వ మజిలీ.

−♦ భైరవునికథ. ♦−

ధారుణీపయోధరాగ్రహారమై యొప్పారు. గిరితటంబను నగ్రహారమున గౌతముండను బ్రాహ్మణ బ్రువుండు గలఁడు. వాఁడు కడుపవిత్రమగు ధాత్రీసురవంశంబునఁ బుట్టియు జనకంటకములగు పనులఁ గావింపుచుండుటంజేసి వాని నెల్లరు భైరవుండని పిలుచుచుందురు.

సీ. ఒకసారి కవినంచుఁ బ్రకటించి బెదరించుఁ
                 బద్య మల్లుచు జానపదు లఁ జేరి
    యొక తేపఁ గరిణీక మొనరించుఁ గాపువా
                 రలనోరుగొట్టు లెక్కలను వ్రాసి
    యొక పరి బేరియై యూరూరుఁ దిరుగు వే
                 ఱొకతేఁప దున్ను హాలికతఁ బూని