పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదయంతికథ.

227

నేను - కాశీనగరము.

రాజు - బ్రాహ్మణులా?

నేను - అవును,

రాజు - ఏమిచదివికొంటిరి?

నేను - నాలుగువేదములు నాఱుశాస్త్రములు నఱువదినాల్గు విద్యలుం జదివికొంటిని.

రాజు — (విస్మయమభినయించుచు) మీ రాకోటముంగలి ప్రకటనపత్రికం జదివికొంటిరా?

నేను - చదివికొనియే యిక్కడికి వచ్చితిని.

రాజు — ఇదివఱ కిట్టిభూతము నెందైన వదలించితిరా ?

నేను – లేదు. ఇదియే మొదటిప్రయత్నము.

రాజు - (పెదవివిఱచుచు) ఈభూతము విద్యలకు సాధ్యముకాదు.

నేను - ఆమాట నే నెఱుంగుదును.

రాజు — మీకు భూతవైద్యమునందుఁ బ్రవీణత గలదా ?

నేను - లేకున్న నిం దేలవత్తును ?

రాజు - మీరు చిన్నవారలు, తెలియక వచ్చితిరనినే నభిప్రాయము పడుచుంటిని.

నేను - అట్టియభిప్రాయము పడనవసరము లేదు.

రాజు — మీప్రాణహానికి నేను బూటకాపును కానుచుఁడీ బాగుగా నాలోచించుకొని దిగుఁడు. ఊరక కాలసర్పమునోటఁ జేయినిడకుఁడు.

నేను - వెఱుపులేదు. ఆలోచించుకొనియే వచ్చితిని.

రాజు - ఎన్ని దినములకుఁ గుదురుతురు ? ఏతంత్ర ముపయోగింతురు?

నేను - ఎన్నోదినములా? అయిదునిమిషములు; తప్పిన రెండు గడియలు.