పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

సీ. బగళాముఖీమంత్ర పారాయణుని పండ్లు
                 డులియఁగొట్టెను మోము డొప్పవడఁగ
    నుగ్రభైరవునిమంత్రో పాసకునిమేని
                 యెముకలు విఱుగంగ నెగిరి తన్నె
    నారసింహోపాసనాదక్షునూరువు
                 కఱచి రక్తము గారఁ గాయపఱచె
    జ్వాలానృసింహమంత్రాలాపనిరతుని
                తలగ్రుద్దె బ్రహ్మరంధ్రంబు పగుల

గీ. నాంజనేయరతున్ గుండె లవియఁ బొడిచె
   గణపతిప్రియు పొట్ట వ్రక్కలుగఁ జీల్చె
   ఛండికారాధకునిఁ గాలఁ జదిమి యడఁచె
   భూపసుత నాశ్రయించినభూత మకట!

శా. ఏతద్భీకరదారుణక్రియలచే హింసారతిం బొల్చు నా
    భూతంబు న్వదలించి మత్సుతి యథాపూర్వంబుగా నంచిత
    శ్రీతో నొప్పుఁగఁ, జేసినట్టిద్విజు ధాత్రీరాజ్యసంయుక్తజా
    మాతృస్థాన మలంకరింపఁగను సన్మానింతు సత్యంబుగన్ .

ఆప్రకటనపత్రికం జదివికొని నేను మందహాసము గావించుచు నందున్న రాజపురుషులతో నే నాభూతోచ్చాటనము గావింపఁగలనని చెప్పితినో లేదో వేగురు నాచుట్టును బ్రోగుపడి అయ్యా ! తమ రెవ్వరు? ఏదేశము? ఏమిచదివికొంటిరి? అని యూరక యడుగుచుండ నందఱకుఁ దగినసమాధానము చెప్పుచు భూతమును వదలింతునని గట్టిగా శపథము జేసితిని.

అప్పుడు రాజపురుషులు నన్ను నగరిలోనికిఁ దీసికొనిపోయి రాజుగారియెదుటఁ బెట్టి మదీయ ప్రతిజ్ఞాప్రకారం బెఱింగించిరి.

రాజు - (నమస్కరించుచు) మీదేయూరు ?