పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యర్థము చెప్పిరి.

అందు స్వరభేదము అర్థస్ఖాలిత్య ముండుట నవ్వుచు నాబ్రాహ్మణుఁడు ఆవిపరీతము వారికిఁ దెలియఁజేసి గంభీరోపన్యాసపూర్వకముగ సత్యార్థము జెప్పి యప్పండితులనెల్ల విస్మయసముద్రములో ముంచి వైచెను.

అప్పుడు వారు అయ్యా రే ! నీయుపన్యాసము విన చతుశ్శాస్త్ర పాండిత్యముగలవాఁడవుగాఁ దోఁచుచున్నావు. ఈయల్పాధికార మేల వహించితివి ? మాతోఁ బురందరపురమునకు రమ్ము. అందుఁ బెక్కు విద్వత్సభలు జరుగును. జయమందినవారికి గొప్పకానుక లితురఁట. మఱియు గోనర్దీయుఁడను విద్వత్ప్రభువుగూడ నానగరమునకు వచ్చుచున్నాఁడు. అనేకవిశేషములు జరగఁగలవు. ఈహైన్యజీవన మేమిటికి ? రమ్మని పలికిన విని యతండు కుచుమారుఁడు బ్రాహ్మణుఁడుగదా ? రాజపుత్రిక నెట్లు వివాహమాడుచున్నాఁడు ? వానికిఁగూడ రాజ్యము గలదాయేమి ? యనియడిగిన నాభూసురు లిట్లనిరి.

అయ్యా ! అది పెద్దగాథ యున్నది. సరస్వతి మహాపండితురాలు. తన్ను విద్యలలో నోడించినవానిం బెండ్లియాడెదనని శపథముచేసినదఁట. కుచుమారుం డోడించెను. తక్కినవిషయములన్నియు మన కేల ? అని సంక్షేపముగాఁ దెలియఁజేసిరి.

అట్లు వారు మాట్లాడుకొనుచుండఁగనే గుత్తదారుఁ డొకచీటి నాబ్రాహ్మణునొద్ద కనిపెను. జయపురాధీశ్వరుఁడగు గోనర్దీయుఁడను మహారాజు మనరేవుదాటి పురందరపురమున కరుగునఁట. పెక్కుసిబ్బందితో వచ్చును కావునఁ దగిననావల నియమించి కడుమర్యాదగా వారిం దాటించి మాట దక్కింతురని నమ్ముచున్నాను. రేపు సూర్యోదయసమయమునకే వత్తురు కావున సర్వము సిద్ధము చేయించవలయును.

అనియున్నచీటిం జదివికొని యాబ్రాహ్మణుఁడు దండనున్న పం