186
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
కుచుమారుండు మణులకు వెలగట్టి యందలిదోషంబులఁ దెలియఁజేయుచు గాజరత్నములఁ జిదియఁగొట్టి తచ్ఛకలములతో రాజపుత్రికనొద్ద కనిపి (3 వ) రూప్యరత్న పరీక్షా అనువిద్యయందుఁ దనకుఁ గలపాండిత్యము దెలియఁజేసెను. అప్పు డాచిన్నది మేను ఝల్లుమన నయ్యారే ! యీపారుం డపారకళాప్రవీణుండువలెఁ దోఁచుచున్నది. ఇదివఱ కింతబుద్ధిమంతుఁడు వచ్చియుండలేదు. భగవంతుడు నాకు భూపతిఁ బతింజేయక భూసురవరుని వరునిగాఁజేయ నిశ్చయించుకొనియెనా యేమి ? అయ్యో ! ఆపారుఁడు రూపంబున నెట్టివాఁడో తెలిసికొనలేదు. కానిమ్ము. అఘటితఘటనాసమర్ధుఁడు పరమేశ్వరుని సంకల్ప మెట్లున్నదియో తెలియదని యాలోచించుచుఁ దనయొద్దనున్న మొద్దు చిలుక నొకదాదిచేత నతనియొద్ద కనిపి దానికి విద్దెలు గఱుపుమని నియోగించినది.
"43 శుకశారికాప్రలాపనం”అనువిద్యయందుఁ దన్నుఁ బరీక్షించు చున్నదని తెలిసికొని కుచుమారుఁ డాచిలుక నందుకొని ముద్దువెట్టుకొనుచుఁ బతంగపుంగవా! నీ వామె రామచిలుకవా? ఆమె నీ కేమి విద్యలునేర్పినది ? ఏదీ ? మీరాజపుత్రిక సందేశము దెలుపుము. పలుకుము. అని యెంతచెప్పినను మాటాడినదికాదు. అప్పు డాదాది అయ్యా! దీని మారాజపుత్రిక విదేశములనుండి తెప్పించినది. ఎంతప్రయత్నించినను దీని కొకమాటయు వచ్చినదికాదు. మంచిమాటలు నేర్పుఁడని మిమ్ముఁ గోరుచున్నదని చెప్పుటయు నతండు ఇప్పుడు నీ వింటికిం బొమ్ము. మాటలు నేర్పి ఱేపు మీభర్తృదారిక యొద్ద కనిపెదనని పలికి యా పరిచారిక నంపెను.
పిమ్మట నతండు తనకు సిద్ధునివలన సంప్రాప్తించిన విద్యామహిమచే దాని నొకసారి దువ్వి తనమెడనున్న యస్తిమాల దానిమేనికిఁ దగిలించి యుపదేశించినంత నాశుకప్రవరం బాశుకవిత్వముతోఁ