170
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
పిమ్మట సువర్ణ నాభుండు నాటకశాలకుఁబోదము రమ్ము. సువర్ణ పదికం జూతువుగాక. ఆచిన్నది నాతోఁగాక యొరులతో మాటాడదు. దేవభాషగాక యేభాషయు రాదు. అని పలుకుచుఁ జేయిపట్టుకొని యచ్చటికిఁ దీసికొనిపోయెను. అప్పుడాచిన్నది పార్వతీపూజఁ గావించుచున్నది. దత్తకుంజూపుచు “దేవీ ! ఏషఏవమమమిత్రః దత్తకః పండిత శిఖామణి" అని చెప్పినంత నాకాంత యత్యంతసంభ్రమముతో లేచి నమస్కరించినది.
దత్తకుం డత్తలోదరిం దీవించుచుఁ బ్రస్తావవశంబున మీయక్కయు బావయునున్న యిక్క నే నెఱుంగుదునని చెప్పెను. ఆమాట విని యాబోఁటి తత్తరపాటుతో మహాత్మా ! వారెందున్నవారో వేగమ చెప్పుడు. వారింజూడ నాకుఁ జాలవేడుక గలిగియున్నది. మీకు మంచి సుకృతమురాఁగలదని బ్రతిమాలుకొనినంత నతండు విమర్శింపక తెరువెఱింగింపుచు గురుతులు సెప్పి యందలి పర్వత గుహయందు వసియించి యున్నవారని యెఱింగించెను.
ఆవృత్తాంతము సెప్పుచుండఁగనే చిత్తచాంచల్యము గలిగినది. మదిలో వికారముదోఁప నిలువుం డిప్పుడేవత్తునని యచ్చోటువెడలి యెక్కడికో పోదొడంగెను. కొంతసేపటికి స్త్రీయైపోయెను. అతనికి వెనుకటిస్మృతి యించుకయు లేక , యెందుఁబోవలయునో తెలియక యలవాటుచొప్పున రుక్మిణి విహరించు నుద్యానవనముదెసకుఁ బోవుచుండెను. ఆయుద్యానపాలురు చారుమతి చారుమతి యని కేకలు వేయుచు నామె యెవ్వరికిఁ జెప్పకయే వెళ్ళిపోయినదని వినియున్నవా రగుటఁ గొందఱు పరుగునఁబోయి రాజపుత్రునకుఁ దెలియఁజేసిరి. ఆవార్త విని రాజపుత్రుం డత్యంతసంభ్రమముతో గుఱ్ఱపుబండియెక్కి దత్తకాదులకు వర్తమానముచేసి యతివేగముగాఁ బోయి యుద్యానవనములోఁ బూవులుగోయుచున్న చారుమతింగాంచి పంచశరవిద్ధహృద