158
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
మనుచు నెఱింగించెఁ దత్తత్క్రియావిశేష
గతుల జూపుచు రతుల నాయతివ కపుడు.
మున్నుతానా యువతి కెఱింగించిన శాస్త్ర లక్షణంబులకు లక్ష్యంబులు సూపుచు నత్తన్వితోఁ బరమానంద మనుభవించెను అని యెఱింగించువఱకు.
150 వ మజిలీ.
−♦ యక్షిణీగానముకథ. ♦−
తెల్లవారక పూర్వమే రుక్మిణి యంతఃపురమునకుఁ దిరుగాఁ జారుమతివచ్చిన దనువార్త రాజపుత్రునకుఁ దెలిసినది. అతండప్పుడ యయ్యంతిపురికిఁ గ్రొత్తకావలి వారల నియమించి సెలవులేనిదే యెవ్వరి నవ్వలకుఁ బోనీయవలదని శాసించి వెంటనే దత్తకాదులఁ దీసికొనిరమ్మని యొక పరిచారకునిఁ బంపెను.
గడచిన సాయంకాలమునుండియు దత్తకునిజాడ దెలియక కుందుచున్న గోణికాపుత్రుండా దూతతో రాజపుత్రునియొద్ద కరిగెను. చారుమతి రుక్మిణి యంతఃపురమునకు మరలవచ్చినదఁట. మనమిత్రుడు దత్తుఁడేమయ్యెను? అతని ప్రతిజ్ఞఁజూపింపవలసిన సమయమువచ్చినదని మదనోన్మాదంబునఁ బలికిన రాజపుత్రుని మాటలవిని గోణికాపుత్రుండు విన్ననగు మొగంబుతో దేవా ! అతండు నిన్ననొకపనిమీఁద నూరికిఁ బోయెను. రెండుమూఁడు దినంబులలో రాఁగలడు. ఆమెరాక వానికిఁ దెలిసినఁ బోకుండునుగదా? యని చెప్పినవిని రాజపుత్రుఁడు సరి. సరి. ఏదియో యంతరాయము వచ్చుచునేయున్నది. మీరతండెందుండెనో యక్కడికేపోయి శీఘ్రమ తీసికొని రావలయును. జాగు సేయకుఁడు పొండు. కనంబడలేదని తిరుగావచ్చిన ననుమతింప, నిదియే మీరు నాకుఁ జేయునుపకారమని పలికి వానినంపివేసెను.
అతండింటికిఁబోవుచు నక్కటా! ఇతని యిక్కట్టు మిక్కుటము