134
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
జూపి వారివలన మఱియొకశాసనము వడసి యప్పుడు వారింబట్టికొన వలయును. వెనుకటి గ్రామస్థులు జెప్పిన మాటలంబట్టి వారింకను మనదేశము దాటిపోవఁజాలరు. నీవు నడువజాలమింజేసి యింతయాలస్య మగుచున్నది. మేమైనచో నీపాటికే వారింగలసికొందుము. వేగమునడువుము. అని పలుకుచు నారాజప్రణిధులు యోగినితోఁగూడ తొందరగాఁ బయనము సాగించుచు జాముప్రొద్దువేళకు ముందరపల్లెఁ జేరిరి.
అందలి వారిఁజూచి పురుషవేషములు వైచికొనిన యిరువురు చక్కని స్త్రీలతో నొకబ్రాహ్మణుఁ డీదారింబోవుచున్నాడు. మీకుఁ గనంబడెనా? అని యడిగినవాండ్రు ఓహో ! వారుస్త్రీలా? పురుషులను కొంటిమి ఇంతకుముందే యీయూరుదాటిపోయిరి. బండిమీఁద బోవుచున్నారని చెప్పిరి.
అప్పుడు రాజభటులా గ్రామాధికారులకు రాజుశాసనము దెలియఁజేసి కొందఱి మనుష్యుల సహాయముగాఁ దీసికొని వడివడిగపోయి క్రోశదూరములో వారింగలసికొని బండికడ్డముగానిలువంబడి నిలువుఁడు నిలువుఁడని యదలించినవిని గోణికాపుత్రుఁడు బండిదిగి ముందరికి వచ్చి మీరెవ్వరు ? మమ్మాపెద రేల ! అని యడిగిన రాజభటు లిట్లనిరి.
పాటలీపుత్రవాస్తవ్యురాలగు రతినూపురయను వేశ్య తనపుత్రికల మిక్కిలి వెలగల మండనములతోఁ దనకు దెలియకుండ నీవు తీసికొనిపోవుచుంటివని నీపైనీదేశప్రభువగువిపులునియొద్ద నభియోగము దెచ్చినది. నీయపరాధము విమర్శించుటకై మిమ్ముఁబట్టి తీసికొని రమ్మని మాఱేఁడాజ్ఞాపత్రిక వ్రాసియిచ్చెను. ఇదిగో చదివికొమ్ము. అని పలికి యా శాసనపత్రిక నిచ్చిరి. దానింజదివికొని గోణికాపుత్రుఁడు మందహాసము గావింపుచు మీఱేని న్యాయాథిపత్యము స్తుత్యమై యున్నది ఇదియంతయు మతంగయోగిని కావించిన కల్పితము. కానిండు రాజ