102
కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.
చింతా -- నీకుఁగాక మఱియెవ్వరికైనం దెలియునా ?
లీలా - కొన్నిదినములు పెట్టించెఁగావున మా పురోహితునకు జ్ఞాపకముండవచ్చును.
చింతా – ఆయనను రేపు సూర్యోదయము కాకపూర్వ మిక్కడికి దీసికొనిరావలయును. అంతవఱకు నీతో మాటాడను. అని పెడమోము పెట్టుకొని పోయి వేరొకగదిలోఁ బండుకొనినది. లీలాశుకుండను
క. ఎక్కడి హరివాసరమిది
యెక్కడి పౌరాణికోక్తియిది నాకయయో?
యెక్కడ వచ్చెను విఘ్నము
చక్కెర విలుకాని కేళిసలుపక యుండన్.
గీ. తద్దినము బెట్టమంచు నీముద్దుగుమ్మ
నన్ను వేపునుగాఁబోలు నిన్నదీని
గుడికిఁ బోనిచ్చుటయెతప్పు విడువదింక
చేసినందాక తన్నిష్ఠ మాసిపోను.
అని విచారించుచు నెట్టకే తెల్లవారినంత నతండతిరయంబునఁ బురోహితు నింటికింబోయి బ్రతిమాలికొని వెంటనే యతని నావాల్గంటి యింటికిం దీసికొనివచ్చెను. చింతామణి పురోహితునికి నమస్కరించుచుఁ గూర్చుండఁ జేసి అయ్యా! మీలోఁదద్దినము పెట్టనివానికేమిశిక్ష విధింతురని యడిగిన నతండు వానిం గులములో వెలివేయుదురు వాని సహపంక్తి బాహ్మణుండెవ్వఁడు భుజింపఁడని చెప్పిన నా వేశ్య మీశిష్యుండట్టి పనిచేయుచుండ నేమిటికి మందలించితిరికారు? శిష్యుని పాపము గురునంటునని యెఱుంగరా? అని యడిగినఁ బురోహితుండు తరుణీ! అతండు నాకుఁ గనంబడి మూడేండ్లైనది. తద్దినము పెట్టుచున్నాడో లేదో యెవ్వరికిఁ దెలియును? వాఁడు నీయధీనములో నుం డెం