పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(10)

సుభధ్రకథ

81

పురుషోత్తమా! నిన్ను జూచినది మొదలు నాడెందము సందియమందుచునే యున్నది. అతి ప్రగల్భములైన భవదీయవచనంబులు వినినంత మఱింత శంక యంకురించినది. వ్రాతపనిచూచుట చేత మఱియుం బెచ్చుపెరిగె నిన్నుగురించి నీవిచ్చిన సంభోధనావాక్యంబులు సామాన్యుల నోటినుండి వచ్చునా? అప్రయత్నముగా నానోటినుండి వెల్వడిన “శరీరము దాచుకొనియదవేల? భవదంగభవపరితాపం బింత యెక్కుడే" అనుమాటలు విని నీపు మందహాసముచేసిన కారణ మిప్పటికి నాకుస్ఫురించినది. అది అట్లుండనిమ్ము. నీవిట్టినికృష్టవేషముతో నిందులకు రాఁగతం బేమి? కులంబెయ్యది? నివాసమెచ్చట? భవదీయాభిదానవర్ణము లేయవి? నిక్కము వక్కాణింపుము. ఇంక గప్పిపుచ్చితివేమి మ్రుచ్చుతనముగా నెంచఁబడుదువని సాకూతముగానడిగిన విని యారాజకుమారుడు చిఱునగవుతో నిట్లనియె.

బోటీ! చల్లకువచ్చి ముంతదాచిన లాభమేమి? యథార్ధము జెప్పెద నాకర్ణింపుము. నేనీపట్టపు రాజకుమారుండ! నా పేరు కందర్పుడందురు. భవదీయరూపలావణ్యాదివిశేషంబు లొరులవలన విని నిన్ను జూచి నీయాకృతి వ్రాసికొని పోవలయునని యిట్టిరూపముతో వచ్చితివని. లేకున్న నీదర్శనంబగుట దుర్ఘటముకదా! ఇదియ మదీయాగమనకారణంబని నొడివిన యాకామినీరత్న మబ్బురపాటుతో నిట్లనియె.

ఏమేమీ నాపుణ్యము? నికృష్ణటకథలందైన నుడువఁదగని మదీయచరిత్రంబు దేవరకు స్మరణపాత్రంబయ్యెనే? ఇంతదనుక నెఱుంగక దేవరవలనఁ బనిగొనిన నాతప్పు సైరింపవేడెదను. ఈ దీనురాలియాకృతితో దేవరకేమిపనియున్నదో తెలియదని మేను గంపమునొంద గద్గదస్వరముతోఁ బల్కుచున్న యాచిన్నదాని భయము వాయ మృదుమధురవచనంబుల నల్లన నతం డిట్లనియె.

అతివా! అట్లు వెఱచెదవేల? యిందు రాజభావంబు విడువుము. నీవుచేసిన తప్పేమి యున్నది? నీబేలతనం బెఱుగక యథార్ధము చెప్పితిని. మిత్రభావముతో మాటాడుము అంతఃపురప్రవేశదోషంబు నాయంద యున్నది. అది తప్పుగా గణించితివేమో అని వెఱచుచున్నవాఁడ ననుజ్ఞయిత్తువేని బోయివచ్చెదనని పలికిన నక్కలికియు నెడదం పొడమిన భయం బుడిమికొనుచు నతనికి సమస్కరించి యిట్లనియె.

రాజపుత్రా! మీప్రగల్భవాక్యంబులకు నేను త్తరంబిచ్చుదాననా? ఈ చిత్రపటంబున నాయాకృతి ప్రక్కను మీయాకృతి యెట్టి అభిప్రాయముతో వ్రాసితిరో యేమంటిరో మీర యెఱుంగుదురుగదా! ఇప్పుడు మఱియొకరీతి మాటలంబల్కిన సరిపడునా? ఎక్కడికిఁబోయెదరు? వచ్చినపని యేమయ్యె? నాకు దరువాయి వ్రాతపని నేరుపక అరుగనిత్తునా? అని పరిహాసగర్భితముగాఁ బలుకుచు అతనిహస్తము గైకొని ముద్దుపెట్టుకొనినది.

ఇంతలో లోపలనుండి సుభద్రా! అని యెవ్వరో పిలిచినట్లయిన అదరిపడి అప్పడంతి సుందరా! కందర్పా! నన్నెవ్వరో పిలుచుచున్నవారు. మాతాత సామా