పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

కాశీమజిలీకథలు - మూడవభాగము

పొలతీ! యీముసలివానికిని నాకునుఁ బరిచయము గలిగియున్నది. అందు మూలమున నింతఅని కూలి నిర్ణయించుకొనలేదు. ఏమిచ్చినం బుచ్చుకొందును. నీ కింకను బెండ్లి కాలేదని చెప్పిన నీయాకృతి కిట్టియాకృతిగల పతియుండినం బాగుండునని వ్రాసితిని. తప్పుకాదుకదా? అని జడిసిన వానివలెఁ బలికిన నక్కలికి సిగ్గుపడుచు నేమియుంబలుకక అప్పటము చూచి తలయూచుచు నొక్కింతసేపు ధ్యానించి మరల నిట్లనియె.

ఓయీ! నాకీపని నేర్చుకొనవలయునని పెద్దకాలమునుండి యుత్సాహము గలిగియున్నది. తగిన యుపాధ్యాయుఁడెవ్వడును లభింపలేదు. దానంజేసి నాకీపని తెలిసినదికాదు. మంచిసమయము దొరికినది. ఇప్పుడు మాతాత యస్వస్థుడైయున్న వాడు. ప్రతిదినము నీవీ కూలివానివెంట నిచ్చటికి వచ్చుచుండుము. ఇందే నేర్చుకొందును. ఎన్ని దినములకు నేర్పగలవు? నీవుకోరినధన మిత్తును. త్వరగామాత్రము నేర్పుమని అడిగిన నతండు తన్వీ! నీబుద్ధి యెట్టిదో పరీక్షించికాని యెన్ని దినములకు వచ్చునది చెప్పనేరను. నీవు సూక్ష్మబుద్ధివని వింటి వేగములోనే గ్రహింపగలవు. అయిన నింతియేల! యిప్పుడు ప్రారంభింతము. గడియలో నీకెన్ని దినములకు దెలియునది చెప్పెదననుటయు సంతసించుచు నమ్మించుఁబోడి అట్లయిన గానిమ్ము సామగ్రిఅంతయు నీయొద్ద నున్నదికదా? అనిపలికిన విని యారాజకుమారుం డున్నదని చెప్పి అప్పుడే తూరుపుముఖముగా గూర్చుండబెట్టి దేవతాగురునమస్కారములం గావింపుమని చెప్పిన నప్పడఁతియు నట్లుచేసినది. తరువాత దూలిక అబ్బాలికచేతి కిచ్చి ముందుగా సరస్వతివిగ్రహము వ్రాయించెను. అట్టిసమయమున రత్నపుటుంగరముచే మెఱయుచున్న అతని అంగుళములపైనున్న వలు వదొలఁగుటయుఁ గనుంగొని విస్మయావేశితహృదయయై యయ్యిందువదన సందియము విడిచి యావ్రేళ్ళంటి యోహో! వీనికెద్దియేని రంగువైచితినాయేమి? యింత వింతకాంతి నీఅంగుళుల కెట్లు వచ్చినది? యిట్టివిలువగల యుంగరములు నీ కెక్కడివి? నీవెవ్వడవు? సామాన్యుడవువలె దోచుటలేదే అని అతనిచేతిపై నున్న వలువఁ బైకిఁ దొలఁగించినది.

అప్పుడతండది సవరించుకొనుచు మేలు మేలు నీ శిష్యరికము జక్కగా నున్నది. వ్రాతమాని నాచేతులు పరీక్షించెదవేల? అనిపలుకగా నవ్వెలఁది మారుపలుకక ఆతండు మొగముపైఁ గప్పికొనివున్న చేలంబు విడలాగినది అప్పుడు మేఘావరణంబు వ్రాసినచంద్రబింబమువలె బ్రకాశించుచున్న అతనిమొగంబు గనంబడినది.

ఆకర్ణాంతవిశాలనేత్రములును అలకభ్రాజితంబైన సుందరపాలంబును, మృదుకపోలములును, మనోజ్ఞరదనచ్చందంబులుం గలిగి మోహనజనకంబై యొప్పు నారాజకుమారుని మోము వీక్షించి యయ్యంబుజాక్షి వివశయై యొక్కింతసేపు తదీయలావణ్యంబు నక్షులంగ్రోలుదానివలెఁ జూచి చూచి తలయూచుచు మెల్లన నిట్లనియె.