పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4]

సునీతి కథ

33

మఱ్ఱిమొక్క నందిచ్చి తాను మెల్లగా నందలి మొక్కలన్నియుం బట్టుకొని క్రమంబున బైకిబోయెను.

అందు దొంగలు పారవైచిన ద్రాళ్ళు కొన్ని ముడిబెట్టి నీటిలోదింపి యా చేడియ యాత్రాడు బట్టుకొనినంత మెల్లమెల్లగా బైకి లాగి క్రమంబున గట్టెక్కించెను.

అప్పుడు వారిరువురు పునర్జన్మ మెత్తినట్లు తలంచుకొనిరి. అది మహారణ్య మగుటచే జనసంచార మేమియునులేదుగావున నందు నిలుచుటకు వెఱచుచు నెటకేని బోవదలచి, అప్పటికి రెండు గడియల ప్రొద్దెక్కినది. కావున జయభద్రుడు ఆ చిన్నదాని కాకలిగా నున్నదని గ్రహించి యాప్రాంత మందున్న యొక వెలగచె ట్టెక్కి పండ్లు కొన్నికోసి యవి యాచిన్నదాని ముందుంచెను.

వానిని దిని యాకలి యడంచుకొనుచు నెండవేడిమి సహింపక తీగవలె వాడియున్న యాచిన్నదాని నొకచెట్టునీడకు దీసికొనిపోయి అందు గూర్చుండబెట్టి విశ్రాంతి వహించిన కొంతసేపునకు మెల్లగా జయభద్రు డిట్లనియె.

కాంతా! నీయుదంతము విన నాకెంతే నౌత్సుక్యముగా నున్నది. సఖ్యము సాప్తపదీనమనుమాట వినియేయుందువు. నీకాపురస్థల మెచ్చట? తల్లిదండ్రు లెవ్వరు? నిన్ను భార్యగాబడసిన పురుషుని యభిధానవర్ణములేయవి? నీయభిఖ్య యెట్టిది- ఆమూలచూడముగా వక్కాణింపుము.

నేను మణిప్రస్థపట్టణాధీశుడైన కుంతిభోజుడను రాజు నేడవకుమారుండ. నాపేరు జయభద్రుం డందురు. నేను రూపవతియు గుణవతియునగు భార్యను నిరసించి యొకవారకాంతమాయలో జిక్కి యిట్టి యిక్కట్టులకు బాల్పడితిని. చెడుదినములలో నెట్టిబుద్ధిమంతునకును మంచియూహలు పుట్టవు కొన్నిదినములు నేను రాజకుమారులలో నుత్తముడను వాడుక పొందియుంటిని. పరతరుణులకొఱకు నిడుమలం గుడుచు చెడుగులం జూచి పరిహాసము చేయువాడ. తుదకట్టి నాకు బ్రాణమిత్రుని నీతివాక్యములు కర్ణకఠోరములైనవి. పైత్యరోగము గలవానిజిహ్వకు బంచదారయు జేదుగానుండునుగదా. ఇట్టి విపత్తు చెందవలసియుండ, నతని మాటలేల చెవికెక్కును. అని తనకథ నంతయు నన్నెలంతతో జెప్పి యయ్యొప్పులకుప్ప మొగమునందు జూడ్కులు నెరయజేసెను. అని యెఱింగించి మణిసిద్దుడు తదనంతర వృత్తాంతము పై మజిలీఅందు వాని కిట్లని చెప్పం దొడంగె.