పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

కాశీమజిలీకథలు - మూడవభాగము

కల్పనా చాతుర్యమందును మిక్కిలి ప్రౌఢుండయి పండితుల హృదయశూలమై యొప్పుచుండెడి తెనాలిరామలింగకవి పూర్వజన్మమున పెద్దకాలము పరమేశ్వరి నారాధించెను.

అమ్మహాదేవి యెప్పటికిని బ్రత్యక్షముకాకుండిన విసిగి అతండు జన్మపరంపరాలబ్ధమైన వికటహాస్య చాటూక్తి పాటవంబున అద్దేవి నెత్తిపొడిచి దూఱుటయుం గినిసి యా దుర్గ యశరీరవాక్కులచే వికటహాస్యకవిత్వమే ప్రాప్తించునట్లు శపించినది.

అది యెఱింగి అతండామె అంతరంగంబు గఱుంగునట్లు వినుతించినమెప్పు బడసి అప్పరమేశ్వరీ నీవట్టివాడ వయ్యును మనోజ్ఞమైన సమయస్ఫూర్తితో రాజసభయందు గొనియాడబడుచుందువు. నీచర్య లెవ్వరికిని దీర్ఘక్రోధమును గలుగ జేయవు. నీ కవిత్వము మిక్కిలి శ్లాఘనీయమై యుండును. మిగుల విఖ్యాతిబొందగల విదియంతయు నుత్తరజన్మంబున బ్రాప్తించునని యోదార్చినది.

దానంజేసి రామలింగకవి వికటచర్యాకరణదక్షుండైనను స్తుతిపాత్రుండయ్యెను. ఆతని చర్యలనేకములు కలవు. వానినన్నింటి చెప్పుటకు మిక్కిలి కాలముపట్టును. కావున నిప్పుడు నీప్రశ్నానుగుణ్యమైన కథ యొక్కటి చెప్పెద. నదియు మనోహరముగా నుండును. సావధానుండవై యాకర్ణింపుము.

కృష్ణదేవరాయలవా రొకనాడు ప్రాతఃకాలంబున నష్టదిగ్గజకవీంద్రులు, పండితులు, పౌరాణిక గాయక పరిహాసకాది పరిజనము సేవింప నిండుకొలువుండి పండితులతో విద్యావిషయమై ముచ్చటించుచు నిట్లనిరి.

కవీంద్రులారా! పూర్వకాలంబున భోజరాజ సభామండనులైన పండితులు కాళిదాస బాణ మయూరాదులు సంస్కృతగ్రంథనిర్మాణదక్షులై వాడుకబడసిరికదా? అట్టివారి నాదరించిన భోజుని యదృష్టమేమనదగినది? దానంబట్టియే అతనిఖ్యాతి భూతలంబున స్థిరంబై యున్న యది పండితుల నాదరింపని రాజు సంపద సంపదయే! సర్వదా విద్వాంసులతో కాలక్షేపము చేయువానిదేజన్మము మద్భాగ్యవశంబునంగదా మీవంటి మహాకవులతో మైత్రి వాటిల్లినది నా జన్మమునకిదియే చాలును మదీయ శ్రవణంబులు సంతతము విద్వాంసుల విద్యావాదముల వినుట నుత్సహింపుచుండును. మీమీ వాదముల పలుమారు వింటిని. అయినను దృప్తిదీరకున్నయది. విలాసార్థము మీకొండొరులకు వాదములు గల్పించితినేని మత్సరగ్రస్తులై మీరు దీర్ఘక్రోధులయ్యెదరని వెరచుచున్నవాడ. కావున నిప్పుడు మీ మదికెక్కిన పండితుం డెందేని గలడేని వక్కాణింపుడు ఆతని బిలిపించి వాదము కల్పించి శ్రోత్రానందము గావించుకొనియెద అది నాకు మిక్కిలి వేడుకగా నున్నదని నుడివిన విని అందఱును మనంబుల నెద్దియో ధ్యానింపుచుండిరి.