పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెనాలిరామలింగకవి కథ

139

అంతలో భట్టుమూర్తి లేచి దేవా! దేవర యభీష్టమెంతయు నొప్పిదమై యున్నది? నాడు భోజుండువోలె నేటికాలంబున దేవరయే విద్యాలంబనమూర్తియై యున్నవారు. మానస సరోవరములను పరమహంసము లాశ్రయించినట్లు పుడిమి గల మహాకవులందఱు నిదివఱకే దేవరయాస్థాన మలంకరించిరి. పెక్కులేల? వీరిలో నొక్కొక్కరుండ జగంబునకు జాలిన పండితుఁడు అట్టి వీరియెదుట బెదవిగదుప మఱియొక పండితునికి సామర్థ్యముగలదా? అట్టివాడెందును మావినికిలో లేడు. సెల వొసంగెదరేని మేమ యొండొరులము ప్రసంగము కావింతుము. గెలిచినవానికి బారితోషిక మిప్పింతురు గాక ఈ ప్రసంగమునకు రామలింగమును మాత్రము దూరస్థుని జేయవలయు నతండుండిన గపటోపాయంబున నెవ్వరికిని జయములేకుండ జేయునని పలుకుచున్న సమయములో ద్వారపాలుడువచ్చి జయశబ్దపూర్వకముగా నిట్లనియె.

దేవా! కాశీదేశమునుండి నిన్న రాత్రి వేశ్యయొక్కతె గజతురగాందోళికాది వైభవముతో వచ్చి బాహ్యారామమున బటకుటీరమున విడిసియున్నదట. దేవర కెద్దియో పత్రిక నంపినది. చూడుడిదియే అని అందిచ్చుటయుంగైకొని అప్పుడమిఱేడు వడివడివిప్పిం ముప్పిరిగొను సంతసముతో నెల్లరువిన నిట్లు చదివెను.

సీ. అరువదినాల్గు విద్యలనుఁ గూలంకష
                 మ్ముగ నెఱింగిన దాన బుధులుమెచ్చ
    రచియింపనేర్తు పద్రపయుక్తి నాశుగాఁ
                 గావ్యనాటక ముఖ గ్రంథవితతి
    కవితావిచిత్ర వైఖరులు దేడపడంగ
                నవధానములు పెక్కులాచరింతుఁ
    బెక్కుదేశము లేగి పృధుకళామతుల ను
               ద్ధతులఁ బండితుల వాదముల గెల్చి
గీ. పేర్మి జయపత్రికలఁగొంటిఁ బృథులనిష్ఠ
    విడచితిని యేవగించి వంగడపువృత్తి
    వ్రతము గైకొంటిఁ విద్యావివాదములకు
    వారకాంతను పేరు మందారవల్లి

ఉ. పండితు లెందఱేని తమపజ్జగలారని యాలకించి మీ
    దండకు వచ్చితిన్ నృపవసంతమ! వాదము సేయఁ బ్రౌఢులై
    యుండినవారిఁ బంపు సభనోటమి గెల్పునుఁజూతురట్టు కా
    కుండినఁ జాలరంచు మఱియుం జయపత్రిక నిచ్చి యంపుమా.

శా. ఏ నేపండితుచేత వాదమున నోడింపఁబడంగాంతునో
    వానింబ్రోచెడురేని యానతి మెయి న్వర్తింతు నీయందగున్
    నేనే గెల్చితినేని దత్పతియు మన్నిర్దిష్టవిత్తంబు స
    న్మానంబున్ జయపత్రికాళి నిదేసుమ్మా ! నావ్రతంబీశ్వరా.