పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

కాశీమజిలీకథలు - మూడవభాగము

మిక్కిలిజాణయగు నగ్గణికయు వారికి గొన్నియడుగు లెదురేగి యర్ఘ్యపాద్యాదులిచ్చి మచ్చికతో జయభద్రుని కేలుదమ్ముంగైకొని మెల్లన దోడ్కొనిపోయి పూపానుపునం గూర్చుండబెట్టి గమనాయాసంబువాయ బూసురటితో వీచుచు జిరునగవు మొగమునకు నగయై మెఱయ నిట్లనియె.

మనోహరులారా! ఆకృతివిశేషములు మీగౌరవములు తెలుపుచున్నవి. మీ యాగమనంబున నాయిల్లు పవిత్రమైనదనుట ముఖస్తుతికాదు. యష్మదభిఖ్యానుగుణ్యంబులగు వర్ణంబుల వాక్రుచ్చి నాకు శ్రోత్రసుఖం బాపాదింపుడు. మీవంటి యుత్తమాతిధుల సత్కరించుటకే యీ భవనము నిర్మింపబడినది. భుజంగశేఖరసేవాసక్తమగు మావంగడము కళానిధిశిరోమణులగు మీకు మన్నింపదగినదని నుడువనక్కరలేదు. నేననంగచంద్రికాభిఖ్యం బ్రవర్తిల్లుదునని చాతుర్యముగ బలికిన విని సుమిత్రుడు సంతసించుచు నయ్యించుబోడి కిట్లనియె.

వాల్గంటీ! నీవంటిపరోపకారపారీణల కిదియే తెరువు. నీసుముఖత్వ మెవ్వారికి హృదయరంజకము కాకుండును. నీయభిఖ్యయే కులశీలవిశేషంబులం దెలుపుచున్నయది నీదర్శనంబున జలజాంబికుడు వీనిహృదయంబున బ్రవేశించి నుత్పానందము గలుగజేయుచున్నాడు. నీకావించిన యుపచారంబులు మాకెంతేని సంతసం బొనరించినవి. ఈతం డీపట్టణపురాజైన కుంతిభోజుని యేడవ కుమారుండు. ఈతనిపేరు జయభద్రుడు. నేనీతని మిత్రుండ సుమిత్రుండనువాడ. ఈతం డీ పురవిశేషముల జూడంగోరిన రహస్యముగా నీవీథికిం దోడ్కొని వచ్చితిని ఇతండింతకు మున్నిల్లు కదలినవాడు కాడని చెప్పిన విని ముప్పిరిగొను సంతసముతో నన్నెలంత యిట్లనియె.

ఓహో! ఈతండు ధరామన్మధుండని ప్రసిద్దిచెందిన జయభద్రుండే! ఆహా! నా పుణ్యమేమి? ఈ దివసం బెంతసుదినము. అని పెక్కుతెఱగుల స్తుతిచేయుచు నత్తరి నత్తరు పన్నీరు పునుగు జవ్వాజి కస్తూరి లోనగు పరిమళవస్తువులతో మిళితమగు మలయజము దెప్పించి యారాజకుమారుని మేనం బూయుచు జారిన పయ్యెద నొయ్యన సవరించుకొనుచు నడుమనడుమ జిరునగవుతో దళ్కుచూపు లతనిమొగముపై నెరయుజేయుచు దడయార బూసురటిచే వీచుచు వింతపలుకుల నబ్బురము గలుగజేయుచు బెక్కుతెరంగుల నతనియంతరంగముగరుగ స్మరవిలాసములు చూపి, కమ్మనలుజిమ్మ బుష్పమాలికయొకటి యొయ్యారముగా నతనిమెడయందు వైచినది.

తదీయకరతలస్పర్శంబున మేనం బులకలుజనింప జిత్తంబునం బొడమిన క్రొత్తవికారము చూపులం దెలియజేయుచు నారాజపుత్రుండు వివశుండై యుండెను. సుమిత్రుండును తదీయచిహ్నంబులం గ్రహించి పంచేశరుని చేష్టలం దిలకించి విస్మయమందుచుండెను.

ఇంతలో సాయంకాలపుగంట గొట్టిరి ఆనినాద మాలించి యదరిపడి