పుట:Himabindu by Adivi Bapiraju.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“చంద్రస్వామి వేదదేవతలను పూజించును. మహేశ్వరుడు ఆతనికి అధిదేవుడు” “గ్రామములో జరుగు నుత్సవముల కీతడు రాడు. పంచాయతీ సభ్యుల నెన్నుకొను సందర్భమున చంద్రస్వామి ఏ విధమగు నుత్సాహమును గనబరచలేదు.” “ఆతని ఇంటికి ఇతరదేశస్థులు కొత్తపురుషులు రాసాగిరి. అనేక రాజద్రోహసభ లాతని ఇంటిముందు జరుగుచున్నవని మాకు తెలియవచ్చినది.” “నేను చంద్రస్వామిచే బ్రాహ్మణమత దీక్ష గైకొంటిని.” “నాకు లేఖలిచ్చి వివిధ గ్రామములకు పంపుతారు” అని పలువురు సాక్ష్య మిచ్చిరి. “ఒకనాడు వేంగీపురమున సంచరణుని యింట నిట్టి సభ జరిగెను. నేను చంద్రస్వామితోకూడ అక్కడకు పోతిని. నన్ను వారు సభలోనికి రానీయలేదు. కాని యొక్కసారి పరధ్యానముతో నున్న నాకు మంజుశ్రీయను మాట వినబడినది” - అని చంద్రస్వామికి కొంతకాలము క్రిందట సేవకుడిగా నున్న యొకడు సాక్ష్యమిచ్చెను.

“అయ్యా! నేను మహేశ్వరానందుని సేవకుడను. శ్రీరాజకుమార మంజుశ్రీని తస్కరించుకొని పోయినవారలలో నొకడు మహేశ్వరానందుడు. ఆతడు చంద్రస్వామి, సంచరణుడు, సోమత్తరస్వామి మొదలగు వారలతో గూడియుండుట చూచితిని. అతడు శ్రీ రాజకుమార మంజుశ్రీని ఎత్తుకొని పోయెనని నాకెట్లు తెలిసెనన ఒకనాడు, అనగా ఇప్పటికి సుమారు పదునాలుగు నెలలవెనుక, అతడును ఒంకొకడును “మంజుశ్రీని మేము హుటాహుటిగా కొనిపోయినాము. అంచెల యేర్పాటు విచిత్రముగా చేసినారు మనవాళ్ళు” అన్న మాటలు నాకు వినబడినవి. అటు తరువాత వారు సన్ననియెలుగుతో మాట్లాడినారు గాన వినబడలేదు” అని యింకొకడు తెలిపెను.

పిమ్మట చంద్రసామి యీ విధముగా సభ్యులదిక్కు మొగంబై చెప్పెను. “న్యాయా న్యాయవిచక్షణులగు సభ్యులకు నేనేమియు చెప్పనక్కర లేకుండగనే నాయందు దోషయేమియు లేదని తెలియును. నా అంతరాత్మయందు ఆద్యంతరహితమై, భగవత్స్వరూపమై వెలుగు వేదములే ప్రమాణములని నమ్మకము. ముక్కోటి దేవతలును ఏకబ్రహ్మ స్వరూపముకొన, ప్రజల దైవదూరులచేసి, మహాపాపము నెలకొల్పుచు, జంబూద్వీపమునే యమలోకమొనరించు నీ పాషండ బౌద్ధమతము నశియించి ధర్మ స్వరూపమగు వేదమతము పునరుద్ధరింపబడవలెనని నా యాశయము. ఇప్పటికిని నాకోర్కెయదియ. వారణాసీపురము, తక్షశిల, పూర్వశైలము ఉజ్జయిని మొదలగు ప్రసిద్ధదేశముల తిరిగితిని. మూడు వేదముల నభ్యసించితిని. ఉపనిషత్తులు, ఇతిహాసములు మొదలగు సమస్త మహా గ్రంథము లెరిగితి. బౌద్ధమత రహస్యములు గ్రహింప పీఠకములు, ధర్మ సూత్రములు మొదలగు గ్రంథరాజములు పాటలీపుత్రమున అభ్యసించితిని. కాని బౌద్ధ మతమున నాకు ద్వేషము మెండయినది. నా జన్మభూమి కేతెంచిన నాటగోలె నా దేశమున బౌద్ధమతము నాశనముచేసి వేదమతము పునరుద్ధరింప సంకల్పము దాల్చితిని. అందుకై అనేకులకు బోధచేసితిని. అనేకులు బౌద్ధులను, వారి దీక్ష మాన్పించితిని. ప్రాయశ్చిత్తములు చేయించితిని. కాని అన్ని దేశములకన్న ఆంధ్ర దేశమున బౌద్ధమతము లోతుగా వేళ్ళుబారియున్నది. నాగవంశములవారు, క్షత్రియులు ఈదీక్ష పుచ్చుకొనినారు. కాన ప్రాబల్యముగాంచిన ఈ చార్వాకమతమును పెల్లగింప నాయొక్కనిచే గాదు. అయినను నాబోటివారు అనేకులు నాతో చేరినారు. మా యుద్యమము విజయము గాంచ సిద్ధమైయుండెను. చక్రవర్తికి ముందు మత దీక్షయీయవలె, దానికై మా ప్రయత్నము,

అడివి బాపిరాజు రచనలు - 2

• 41 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)