పుట:Himabindu by Adivi Bapiraju.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడు సోమదత్తుని మోము పరికించి చక్రవర్తి యిట్లనియె “వ్యాయామాచార్యా! సోమదత్తా! ఈ బాలకు డెవరు? ఈతని యుదంతమేమి?” అని యడిగెను.

“మహారాజాధిరాజా! ఆంధ్రసార్వభౌమా! సర్వరాజన్యకిరీటమణి ప్రభాస్నాత పాదుకా! జయ జయ! ఈ బాలుడు దేవరశిల్పియై విఖ్యాతి గాంచిన మహాభక్తుడగు ధర్మనంది తనయుడు. సువర్ణశ్రీకుమార నామధేయుడు. నా శిష్యులలో నుత్తముడు. ఉక్షాశకట పరీక్షకు మా పరిశ్రమాలయ పక్షమున నొకవీరుని పంపుట పూర్వమునుండియు ఆచారము. శ్రీ శకటాధ్యక్షులు మాకు లేఖ నంపుటతోడనే మే మొక పందెము నేర్పరచి అందు విజయుడగువాని నీ ఉత్సవపరీక్షకుపంపుట దేవరకు విశదము. ఈ సంవత్సర మీబాలుడు విజయియై ఇచ్చటకువచ్చి ఇక్కడను జయము గొన్నాడు” అని విన్నవించెను. అప్పు డొక్కసారి వందిమాగధులు పాడినారు. దుందుభుల మ్రోగించినారు. జయ జయధ్వానము లొనర్చినారు. వైతాళికులు కీర్తించినారు. మేళపతులు శంఖ కాహళ నాగస్వరాది వాద్యముల పల్కించిరి.

11. విజయ బహుమానము

సద్దుమణగినంతనే సార్వభౌముడు మహామంత్రివైపు చూచెను. మహామంత్రి ప్రధాన వైతాళికుని కన్నుసన్న జేసెను. అప్పుడు తళుకు తళుకుమను దీపలక్ష్ములు, సర్వభూషణాలంకృతలై హారతులగొనివచ్చి, పాటలు బాడి మంగళము లిడిరి. ఇరువురు బాలికలు వెంటనే వివిధ సుమమాలల గొనివచ్చి యాతని మెడను వైచిరి.

అంత వీణానాదము మృదంగము వేణుస్వనము వినవయినవి. ఈ వలావలనుండి సుందరులగు ఇరువదిమంది బాలికలు నాట్యము చేయుచు విచ్చేసి సువర్ణశ్రీ కుమారుని చుట్టును “ధర్మవిజయము”ను అద్భుతాభినయపూర్వకముగ నాట్యమొనరింప నారంభించిరి. ఆ బాలికలలో సార్వభౌముని ఇరువురి తనయులు, రాజకుటుంబములోని బాలికలు, సచివుల సేనానాయకుల కుమార్తెలు, కోటీశ్వరుడగు చారుగుప్తుని పుత్రి హిమబిందును కలరు. ఆ నాట్యమునందు పాల్గొననుత్తమవంశ సంజాతలగు యువతీ రత్నములకే అర్హత.

మంగళవాద్యములు మ్రోగుచుండెను. దేవవేషమున నాట్యగురువు ప్రవేశించెను.

ఈ విజయ గీర్తింప
ఈ వియచ్చరులెల్ల
గగన పథముల వచ్చి
కాంతితో ప్రసరించి
పూలవర్షము కురిసి
తేలుచున్నారదిగొ
ఈ విజయ గీర్తింప”


బాలిక లప్సరసలవలె నభినయించుచు,

“ఓయి యౌవనమూర్తి
ఓయి సుందరస్వామి
రావయ్య జయదామి
కావక్షుడవు కమ్ము”


అడివి బాపిరాజు రచనలు - 2

• 30 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)