పుట:Himabindu by Adivi Bapiraju.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెల్లని భద్రదంతావళముపై నధిరోహించి చక్రవర్తి ఆ ముందు రాత్రి యంతయు నూరేగినాడు. ఆ దంతావళాలంకారమే కోటిపణములు విలువ చేయునట.

చక్రవర్తి సింహాసనమున కెడమభాగమున దేవి ఆనందమహారాజ్ఞి వేరొక సింహాసనముపై నధివసించియుండెను. ఆమె కెడమప్రక్క రెండు సింహాసనములపై శ్రీకృష్ణసాతవాహన మహారాజు, మంజుశ్రీ రాజకుమారు లధివసించియుండిరి.

దేశదేశములనుండి మహారాజులు, మహాప్రభువులు, భూపతులు, సామంతులు, సేనాధికారులు, వర్తకచక్రవర్తులు, మహామంత్రులు, మహా పండితులు వచ్చియుండిరి.

లోకమంతయు ప్రసిద్ధినందిన నాయకులు, కవులు, శిల్పులు, నాట్య వేత్తలు వచ్చియుండిరి.

సాముగరిడీలవారు, ఆయుధవిద్యావిశారదులు, మంత్రవేత్తలు, మల్ల ముష్టి యుద్ధపునిపుణులు వచ్చిరి.

ఉత్సవమునందు పాల్గొన అనేకులు జానపదులు, నాగరులు వివిధ దేశములనుండి వచ్చిరి. యవనరాజ్య రాయబారులు, మ్లేచ్ఛదేశ రాయబారులు వచ్చియుండిరి.

స్త్రీమండలమున కౌస్తుభమణివలె చంద్రబాల యొక సింహాసనము నలంకరించి యుండెను. ఆమెప్రక్కను చక్రవర్తికుమారికలు మాయా దేవియు, శాంతశ్రీదేవియు అధివసించి యుండిరి. చంద్రబాల కుడిప్రక్కనే అపర ప్రజ్ఞాపరిమితా దేవివలె హిమబిందు అధివసించియుండెను. అచ్చటనే ముక్తావళియు, అమృతలతాదేవియు, శక్తిమతీదేవియు, నాగబంధునికా సిద్ధార్థినికలు ఉచితాసనముల నధివసించి యుండిరి.

చక్రవర్తి కుడివైపున ఉచిత సింహాసనముపై చారుగుప్తవర్తక సార్వభౌములు నివసించి యుండిరి. వారివెనుక అచీర్ణమహామంత్రియు, ధర్మనందియు అధివసించి యుండిరి. సంపూర్ణ కవచాఢ్యులై స్వైత్రులవారు సార్వభౌమ సింహాసనము కడ కత్తిదూసి నిలిచియుండిరి.

ఆవలప్రక్క సోమదత్తాచార్యులుండిరి. సింహాసన వితర్దికా సోపాన పంక్తి మ్రోల సమవర్తి సాతవాహనుడు, శుకబాణులవారును, సువర్ణశ్రీయు ఉండిరి.

స్థౌలతిష్యునకు చంద్రస్వామి ఉపవసిష్ఠు డయెను.

అమృతపాదార్హతులు సింహాసనమునకు ఎడమప్రక్క సువర్ణపద్మ పీఠముపై అధివసించి యుండిరి. వారి ననుసరించి వివిధసంఘారామ కులపతులు, అర్హతులు, ఆచార్యులు, భిక్షులు, పీఠముల పై అధివసించి యుండిరి.

మంజుశ్రీని పెంచిన చంద్రస్వామి చెల్లెలు కరుణశ్రీదేవి ఆనంద మహారాణి వెనుక పీఠమున అధివసించి యుండెను. ఆమెభర్త గౌతమ పండితులు, స్థౌలతిష్యుని శిష్యులు వారికి యాజకత్వమున సహాయముచేయు చుండిరి.

అభిషేకము జరిగినది.

బౌద్ధులు బౌద్దవిధానమున వినయపిటకమునుండియు, దమ్మసుత్త ములనుండి మంత్రములు పఠించిరి.

“నమో తస్స భగవతో అర్హతో,
సమ్మ సముబద్ధస్స!
బుద్ధం శరణం గచ్ఛామి,

అడివి బాపిరాజు రచనలు - 2

• 292 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)