పుట:Himabindu by Adivi Bapiraju.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



చతుర్థభాగం



1. నాగబంధునిక

నాగబంధునిక తల్లితో, చెల్లెలితో కలిసి ధర్మనంది శిబిరమునకు వచ్చినది. అన్నగారిని తొలుత కలుసుకొన్నప్పు డామె పొందిన యానందమునకు మేరలేదు. కాని ఎప్పుడు శిల్పభావముల నాలోచించుకొను సువర్ణుని మో మిప్పుడు తీక్షణకాంతి యుతమై ఆమెకు భయముకొల్పినది.

ఒకనాడు నాగబంధునిక అన్న రూపమును పరిశీలనా దృష్టితో చూచినది. ఆతడు బవిరిగడ్డము పెంచికొనినాడు. మీసము తుమ్మెదరెక్కలవలె మిలమిలలాడుచు గడ్డమున గలిసిపోవుచుండెను. స్నాన మాచరించునప్పు డతని కండరములు వింధ్య పర్వతాగ్రముల వలె ఉబికిపోవుచుండెను. ఆతని వెడద యురము మానుతున్న గాయములతో విశాల తామ్ర పర్వత సానువువలె కాంతిల్లుచు తోచినది.

అతని ప్రతిఅంగము వజ్రశక్తిని మూర్తించుకొని ఆమెకు ప్రత్యక్ష మైనది. తన అన్న కన్నులలో నేడు స్వప్నములులేవు. మనోహరరూప దర్శన జనితానంద కాంతి తరంగములులేవు. యౌవనస్పృష్ట మధుమాస మత్తతలు లేవు. ఆ కన్నులలో నిశితకరవాల ధారా రోచిస్సులు, వజ్రనిపాత తళత్తళలు పరవడులై ప్రత్యక్షమైనవి. ఆ కాంతితెరలవెనుక ఏది నిశ్చయము, ఏదియో నిస్పృహా, ఏదియో భగ్నస్వప్నము దూరాన నడయాడు చున్నట్లా బాలలకు తోచినవి.

అన్న దేహమును మర్ధించుచు మార్జనకుని ఆవలకుబంపి వీరవ్యవసాయకుశల యైన నాగబంధునిక సువర్ణశ్రీ శరీరము తానే ఉద్వర్తనము చేయుచు, “అన్నా!” యుద్ధమునందు మనవారు ఎక్కువజాగ్రత్త వహించుచున్నారేమి? యని ప్రశ్నించెను.

“చక్రవర్తి జననష్టమున కియ్యకొనడు. సైనికులు అనవసరముగ ప్రాణముల బలి యీయరాదు. విరోధుల ప్రాణముల బలిగొనరాదు, సాధ్యమగునంతవరకు బందీల చేయవలయును.”

“కోటలో భోజనాది వస్తువుల తగ్గించి పాటలీపుత్ర పురవాసుల లోబరచు కొనవలయిననియా?”

“అదే మాయుద్ధేశము. చక్రవర్తి ఆజ్ఞ లట్టివి. అమృతపాదాచార్యుల వారి ఆదేశ మట్టిది.”

“ఉజ్జయిని యుద్ధమందును ఇట్టి యుద్ధనీతియే గమనించిరా?”

“ఆ!”

“మహాబలగోండుడు మన శిబిరమునకు వచ్చినప్పుడు నిన్ను గురించి అన్నియు నడిగితిని.”

“అవును, ఆతడు నాకు తెలిపినాడు నాగూ!....”

“ఎందుకు అన్నా, నీ హృదయములోని బాధ నాకు వ్యక్తమైనదిలే!”

“నీ హృదయములో నేదియో యున్నది. అది నా కర్థమగుటలేదు.”

“నా హృదయమున నే మున్నది అన్నా?”

అడివి బాపిరాజు రచనలు - 2

• 239 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)