పుట:Himabindu by Adivi Bapiraju.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాండ్య చోళ కేరళ పాంచాలములనుండి దిట్టరులగు వారు వచ్చిరట. ఇంకను పెక్కుమంది యున్నారు.

ప్రభా: గెలిచినవారికి కానుకలమాట చెప్పవైతివి?

సమ: ప్రతివర్షము నిచ్చునదిగాక, ఈ ఉత్సవమున అన్ని పరీక్షలకు అదనపు కాన్కల నిత్తురట సార్వభౌములు.

ప్రభా: ఉక్షశకటపరీక్షకు అదనముగా ఏమిచ్చెదరో చెప్పుకోండి. ఇవిగో పదిపణాలు పందెం.

చాలమంది వివిధ వస్తునామము లుచ్చరించిరి. ఇంతలో ప్రతీహారియగు నొకదళపతి లోనికి విచ్చేసి నమస్కరించి “జయము జయము వీర శ్రీమంతులకు! ఉపాధ్యక్షులవారు విజయము చేయనున్నారు. వారి రథము మూడవద్వారము దాటినది” అని నిర్గమించెను.

ఆయుధపాణులగు నలువు రంగరక్షకులు వెంటరా నుప సైన్యాధ్యక్షులగు కాకుండకులు సంపూర్ణ కవచధారియై విచ్చేసిరి. ఒక్కసారిగా సేనాధికారులందరు లేచి నమస్కరించిరి. అందరికి ప్రతినమస్కృతులిడి కాకుండకు లోక దంత పీఠ మలంకరించి వారిని “కూర్చుండు”డని సంజ్ఞచేసిరి.

“రేపటి మహోత్సవమునకు శతస్కంధుడు, ప్రమానందుడు, చండకేతుడు, గుణవర్మ రథ గజ తురగ పదాతులతో రక్షకులై వచ్చునది. ముప్పది ఏనుగులు, రెండువందల రథములు, అయిదువందల గుఱ్ఱములు, మహాఖేలనా స్థలము చుట్టును విడిసి ఉండవలసినది. సార్వభౌముల ఊరేగింపు మహోత్సవమున నూరు ఏనుగులు, అయిదువందల రథములు, రెండువేల పదాతి దళము, వేయి గుర్రములు కావలికాయునది. అందులకు వలయు నాయకులను అమలనాధులవారు ఏర్పాటు చేయుదురుగాక. వారే ఆ ఉత్సవమునకు అధిపతులు. వారి నాయకత్వమున ఇంక నన్ని సైన్యములు ఊరేగింపు టుత్సవమున పాల్గొనవలసినది. కుంభీరకులు, ఉపపాదులు, అనుగ్రహులు, ఉద్ఘాటకులు యీ నలువురు సేనాపతులు చక్రవర్తికి అంగరక్షకులుగా వెళ్ళవలయునని సర్వసైన్యాధ్యక్షుల ఆజ్ఞ. అమలనాధులు ఎన్నుకొనిన ఉపసేనానులూరేగింపుటుత్సవ సైన్యములు నడుపునట్లు ఆజ్ఞ. ఆయా యోధాగారాలలో వంతు వచ్చినవారు కావలియందురు గాక. తక్కినవారు మహోత్సవమునందు పాల్గొనవచ్చును. ఈ ఉత్సవము నవదినముల నీ యాజ్ఞయే వర్తించును. తథాగతుడు మీకు రక్ష” అని కాకుండకులు యథోచితముగ వెడలిపోయిరి. 

4. విషబాల

బుస్సు” మని యా పాము లేచినది. దాని కన్నులలో నవ్వుతాండవ మాడినది. ఆ కన్య యా పాము నెత్తుకొని, కుడిచేతితో పడగనందికోని, ముక్కుతో ఆ ఫణిరాజు ముట్టెను ప్రియమార రాచినది. అది భయంకర కాలోరగము. ఆరడుగుల పొడవుతో మిలమిలలాడు నీలనీరధి కల్లోలము అర్జునుడను ఆ పన్నగేంద్రు డాయోషాతిలకమును అలmeను. నాగవల్లివలె చుట్టుకొనిపోయెను.

“అర్జునా! నీవు మంచివాడవోయీ! నీ కన్నులు వజ్రాలవలె మిలమిల లాడుచున్నవి. నీ తలమానికము తళతళ తోచుచున్నది. నీ దేహన నీలరత్నాలు మిరుమిట్లు కొలుపుచున్నవి.

అడివి బాపిరాజు రచనలు - 2

* 9 *

హిమబిందు (చారిత్రాత్మక నవల)