పుట:Himabindu by Adivi Bapiraju.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. సైన్య వేగము

ఆంధ్ర సైన్యములు తరిమి నడచుచున్నవి. ధాన్యకటకమునుండి శుభ ముహూర్తమున నా సైన్యములు బయలుదేరినంతనే, ఒకవంక పాటలీ పుత్రమునకు, రెండవవంక ఉజ్జయినికి శత్రుచారులు వేగు తీసికొనిపోయిరి.

స్థాలతిష్యుని అపకృష్టులు వారికి వార్త గొనిపోయిరి. చోళ, చేర, పాండ్యాధిపతులకు స్నేహవార్తలు వెళ్ళినవి. వారును ఆంధ్రచక్రవర్తి మాళవమునకు బోవుచున్నా డనియే భావించిరి.

కళింగము ఖారవేలునియనంతరము ఆంధ్రసామ్రాజ్యమునకు సామంత రాజ్యముగనే పరిగణింపబడుచుండెను. కళింగులు ఆంధ్రచక్రవర్తికి కప్పము మాత్రము కట్టరు. వర్తకాదిస్వామ్యము లన్నియు ఆంధ్రులవే.

కళింగదేశాధిపతికి శ్రీముఖసాతవాహనుడు అత్యంతరహస్యమగు సందేశము నొండు తన మంత్రిసత్తములం దొకనిచే నంపెను. అందు చక్రవర్తి కళింగముదారిని మాళవమునకు బోవును గాన కళింగరాజ్యమున బోవు ఆంధ్ర సైన్యములకు దారి సుగమముచేయ సార్వభౌముడు కోరియుండెను. అది ఆజ్ఞతో సమానము.

మాళవరాజధానియగు నుజ్జయినికి బోవుమార్గమున ప్రతిష్ఠాననగర మున్నది. ప్రతిష్ఠాననగరమునుండి తిన్నగ నుత్తరముగ ఉజ్జయినికి రాజపథ మున్నది. ఆ పథమువెంట ప్రతిష్ఠానమునుండి ఉజ్జయిని ముప్పది అయిదు యోజనములుండును. కాని దుర్గమము లగు కాంతారములు, పర్వతము లుండుటచే రెండులక్షల పుళింద సైన్యము నా మార్గమున ఆంధ్రుల నడ్డుతగులుటకు మాళవులు సిద్ధముచేసినారు. లోయల కీవ లావల కొండలలో, నదులదాటు ప్రదేశములలో, అడవులలో పుళిందులు బెబ్బులులవలె పొంచియుండిరి. వారికి బాసటగ ఘూర్జరులు, ఆభీరులు, పారశీకులు, మాళవులు-పోరుల గాకలుతీరిన చండవిక్రము లుండిరి.

ఉజ్జయినికి దుర్గమభయంకరాటవులగుండ రెండవమార్గ మున్నది. గోదావరీ తీరమునుండి పోవుచు వరదానది గౌతమియందు సంగమించు శబర రాజధానియగు శ్రీగ్రామమునకు (సిరిమంచ) బోయి, యచ్చటనుండి వరదానది తీరముననే నాగదేశము జొచ్చి వాసుకీనగరము (నేటి నాగపురము) చేరి, యచ్చటనుండి మాళవదేశము చొరవలయును. ఆ దారిని సామాన్యముగ ప్రయాణము చేయుటమే కష్టము. యుద్ధ యాత్రకు మొదలే తగదని చెప్పఁబనిలేదు.

మూడవమార్గము దక్షిణకోసలమునుండి విదేహముచేరి, విదేహము నుండి శోణానదిని దాటి, శోణాతీరముననే ఎగువకు దక్షిణముగా బోయి, వింధ్య పర్వతపాదము ననుసరించి యా శ్రేణి ప్రక్కగనె అవంతిమీదుగా మాళవము చేరవలయును. కాని అది చుట్టుదారి.

ఏ దారిని వెళ్ళునో ఆంధ్రచక్రవర్తి పోకడ ఏరికిని అర్థమగుట లేదు. గోదావరి తీరమునకు బోయినచో, నొక్క ఆంధ్రవీరుడైన ఉజ్జయిని చేరుటకు మిగులడు. చుట్టుదారిని చేరుటకుమున్ను ఉజ్జయిని శత్రుహస్తగత మగును.

అడివి బాపిరాజు రచనలు - 2

• 148 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)