పుట:Himabindu by Adivi Bapiraju.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిన్నచిన్న నావలలో ద్రోణులలో కైవర్తులు సముద్రములోనికి వరువాతనే వెడలిపోయి, వలలు వేసి చేపలుపట్టి సాయంకాలానికి తిరిగివత్తురు.

సువర్ణశ్రీ అట్టి పడవలలో నొక యుదయమున బయలుదేరి సముద్రములోనికి పది గోరుతములవరకు పోయినాడు. అలల కా ద్రోణి ఇటునటు ఊగినప్పుడు మొదట సువర్ణశ్రీకి కొంచెము వికారము పెట్టినది. కాని అత డది మనోబలముచే తగ్గించుకొని, సముద్రములోనికి నిర్భయముగ వెడలిపోయెను. ఒక ముహూర్తము గడుచునప్పటికి తూరుపున ఎర్రని చిరువెలుగులు కాననైనవి. అనంతమువలె దృశ్యమైన సముద్రమును, దెసలును, ఆకాశమును! ఈ ఆనంత్యమధ్యమున తా నీ చిన్నద్రోణిలో! ఎవరికివారు ఆనంత్యమధ్యస్థులే. ఆనంత్యము ప్రతి ప్రాణిని చుట్టియుండును.

అనంతవిశ్వమున ప్రాణి ఎటు పోవుచున్నాడు? ముందునకా, వెనుకకా? ఈ యాత్రకు అవధిలేదు. ప్రాణము ఈ యాత్రనుండి తప్పికొని, నిర్వాణానందము నందుటయే అంతమా?

ఈ యాత్ర దుఃఖమా, ఆనందమా? ఆనందమునకు మార్గముమాత్ర మానందముగాక దుఃఖమెట్లగును? దుఃఖముకూడ ఆనందమునకు వేరొక రూపమా? వెలుగులో చీకటి యున్నది. చీకటిలో వెలు గున్నది.

సూర్యునివెలుగు ఆనంద మనుకొన్న ఆ వెలుగు భాగించిన సర్వ వర్ణములు వచ్చుట విచిత్రము. ఈ సర్వవర్ణములు (గిన్నెలలో కలిపి) మిశ్రముచేసిన నలుపు వచ్చును. అవి కలుపగా కలుపగా తెలుపువచ్చును.

ఇవియన్నియు బ్రత్యక్షములు. యీ సత్యమును గురుతించువారే మానవులు. తక్కినవారు కనులున్న గ్రుడ్డివారు.

హిమబిందు ఏల తన జీవితప్రాంగణము ప్రవేశించినది?

ఇంతలో అరుణకాంతుల పెదవులతో, కమలరక్తుల కపోలములతో దివ్యసుందరి యగు ఉషస్సు ఆకాశమున ప్రత్యక్షమైనది.

ఆ ఉషోబాలను సందర్శించగనే హిమబిందామెచెలియలువలె సువర్ణునకు తోచినది. ఆతని గంభీరవియోగమున ఆ క్షణము గాఢబాధా పూర్ణమై పోయినది. ఆ బాధ భరింపలేక ఆ సుకుమారుడు కండ్ల నీరు కెరటములై పోవ నావలో బిగుసుకొని పోయినాడు.

అప్పుడొక కైవర్తుడు “అదేమిదొరా! మీ కన్నీరు నీటిలో గలియు చున్నది” అని ప్రశ్నించెను.

ఆ శిల్పి వెడనవ్వు నవ్వుచు “ఏమియు లేదు. ఈ అందముచూచి, ఆనందముచే కన్నులనీరు తిరిగినది” అని ప్రతివచన మిచ్చెను.

“అవునండి బాబూ! నిత్తెంచూచే మాకే ఈ పొద్దు చాల అందంగా ఉంది.”

“అటులనా! ఈ పాట వినుము.
ఆడవే! కల్యబాలా!
ఆకాశరంగమున, అరుణయవనికపైన
ఆడవే కల్యబాలా!
తుంబురుడు నారదుడు తోచిరే ఇరుదెసల
బంభర సునాదములు జృంభించె తంత్రులన్
ఆడవే కల్యబాలా!

అడివి బాపిరాజు రచనలు - 2

• 135 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)