పుట:Himabindu by Adivi Bapiraju.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలోన గోపకులకు చిత్రగోపుడు వంటచేసెను. సువర్ణశ్రీ పచ్చి పులుసు చేసెను. ఉప్పును, మిరియముల పొడిని వేసి సుగంధపు బొడిని జల్లిన ఆ పులుసు సిద్ధార్థినికకు గోపకులకు అమృతోపమానమై యుండెను. తల్లి ఇచ్చిన పచ్చడులను నంజుకొనిరి.

భోజనము లైనవెనుక ఎండ మిక్కుటిముగ నుండుటచే వారంద రాసత్రమున సాయంకాలమువరకు విశ్రాంతితీసికొని, గాలి తిరిగి చల్లపడ గనే, ప్రొద్దు మూడు గడియ లున్నదన ప్రయాణమును మరల సాగించిరి. అక్కడనుండి రాత్రి జాముపొద్దుపోకుండగనే పాటలపురము (గుంటూరు కడ చేబ్రోలు) చేరినారు. ఆ రాత్రి అక్కడ విశ్రమించి, ఉషః కాలముననే బయలుదేరి మధ్యాహ్న భోజనమునకు ధనదుపురము చేరినారు.

ధనదుపురము చేరునప్పటికి సముద్రపుగాలి ఎత్తివేయుచుండెను.

ఆ మారుతములు సువర్ణశ్రీకుమారునికి హృదయవేదన మరింత ఇనుమడింప జేసినది. అచ్చట దగ్గరచుట్టములు చాలమంది యుండుటచే సువర్ణశ్రీయు సిద్ధార్థినికయు ఆ మహానగరమందు మూడురోజులుండిరి.

ధనదుపురము (చందవోలు) ఇక్ష్వాకులమండలమునం దున్నది. గొప్ప వర్తక కేంద్రము. అనేకులు కోటీశ్వరు లక్కడనున్నారు. అచ్చట రెండు ఇంద్రాలయములు, ఒక మహేశ్వరసర్వతో భద్రాలయము నున్నవి. అవి యన్నియు సువర్ణశ్రీ చూచినాడు.

ధనదుపురమునుండి ఇక్ష్వాకులరాజధాని యగు ప్రతీపాలపురవ (భట్టిప్రోలు) చేరినారు. ఇచ్చట నొకమహాచైత్యమున్నది. ఆ చైత్యమునకు పూజలు సలిపి, సాయంకాలమునకు కృష్ణదాటి పయనించి శ్రీకాకుళపురము జేరినారు.

శ్రీకాకుళపురమును జేరినవెంటనే వారి అమ్మమ్మ వారిరువురకు దృష్టితీసి లోనికి తీసికొనిపోయినది. చిన్నమేనమామ ఆరితేరిన లోహకారుడు. ఆంధ్రదేశమున అంత ఉత్తమలోహకారుడు లేడని పేరు పొందినాడు.

23. సముద్రతీరము

సముద్రయానము సలిపి ద్వీపాంతరములనుండి కృష్ణానదీముఖమున గొనివచ్చిన వివిధ తరణులను, కూపకముల జూచుచు, వానికిగట్టు రజ్జులు గమనించుచు, వస్తువులతో దోనెకడుపులు నింపుకొని ప్రయాణ సన్నాహమున నున్న నౌకలను గమనించుచు సువర్ణశ్రీ కాలముగడప దొడగెను.

శ్రీకాకుళమునందనేక దేశములనుండి వచ్చు వర్తకులు, నావికులు, వీరులు, వింత చూడవచ్చినవారు కాపురములు చేయుచుందురు. వచ్చుచుందురు, వెళ్ళుచుందురు. ఆ మహాపట్టణమున నెన్నియో సరకులగృహములు, వర్తకశాల లున్నవి. మంచి నేతశాల లున్నవి. వలువలకు వన్నెలద్దువారి గృహములున్నవి. ఆ దినములలో శ్రీకాకుళమునకు నిద్రలేదు. చిత్తమునకు శాంతిలేదు” అను సామెత ఆంధ్రదేశమునందు వాడుకయైనది.

ఆ పట్టణమున వినవచ్చిన భాషలు కాశిలోనైన వినరా వందురు. ద్రావిడము, సింహళభాష, సువర్ణాది ద్వీపముల భాషలు, మాగధి, అర్ధమాగధి, పాలి, చీనాభాష, యవన, రోమక, జెండవిష్ట, తురష్కాదిభాషలు ప్రతివీధి యందును వినబడును. ఆ పట్టణమునందుండు కైవర్తదాశరధులు సముద్రమునందవలీలగ నెంతదూరమైన నీదగలరు.


అడివి బాపిరాజు రచనలు - 2

• 134 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)