కొండు : (త్రివిక్రమరావు పంతులుగారి దగ్గరకు వెళ్ళి) ప్రభువువారు జాజి నగరం జమీందారు వారనుకుంటాను.
త్రివిక్రమరావు : అలాగే నన్ను చూసి అంతా అనుకుంటారు. మేము తుమ్మల పాలెం మొఖాసాదార్లం. మాకు భూములవల్ల పది పదహారు వేల్దాకా వస్తాయి.
కొండు : నా విష్ణుః పృథ్వీపతిః అన్నాడు. భూస్వాములు కాకపోతే ఆ రాజవర్ఛస్సు యెలా వస్తుంది. తమ నాయనగార్ని మా బాగా యెరుగుదును. నాయందు వారికి చాల దయ. పిల్ల జమీందార్లును - అఖండ అన్న ప్రదాతలును - ప్రభువు వారు యిక్కడ దిగుతారు? పైకి దయచేస్తార? యిక్కడ దిగేటట్టయితే మా యిల్లు విశాలంగా వుంచుంది. యే విధమయిన యిబ్బందిన్నీ వుండదు. యీ గ్రామం గొప్ప క్షేత్రం. పాండవ ప్రతిష్ట కోదండ రామస్వామి వారు స్వయం వ్యక్తం.
త్రివి : మేము విలాసార్థం దేశం చూదామని విజయం చేస్తున్నాం. మీ గ్రామంలో చోద్యాలేమయ్నీ వుంటే రెండు పూటలు గడుప అభిప్రాయం కద్దు.
కొండు : చోద్యం అంటే పాతకోట కద్దు - సీత గుండం కద్దు. స్వామివారి ఉద్యానవనం కద్దు. అందులో మంటపము, దేవ నిర్మాణం దేవాలయం. నౌఖరీ చేసేవారు యాభయి యిళ్లు భోగం వాళ్లు వున్నారు. మంచి విద్యావంతులు - రూపవంతులున్నూ.
త్రివి : అయితే యిక్కడ దిగుతాం.
కొండు : యేమర్రా - ఓయి - కళాసులు.
త్రివి : సాయిబు వున్నాడు - మీరు శ్రమ పడకండి.
కొండు : పరాయిలపనా యేమిటి? తమ పనికి నా కభ్యంతరము లేదు.
అల్లీఖాను : (ప్రవేశించి) నీకీ పైకీ చలోజీ
కొండు: నేను సామాను అందిస్తాను. నువ్వు బహర్రఖో.
అల్లీ : నాకి బాత్ నకోజీ - నీకి సామాన్ మత్పకడో.
కొండు : అమ్ముకి తక్లేఫ్ నహి (అని అటూ యిటూ సామానుతీస్తూ సీసా గళాసులు తన్నివేసును)
అల్లీ : అరే బంచూత్ కామ్కియా.
కొండు : అపరాధం - అపరాధం
త్రివి : అవి మనవి కావండి - యెవడో దొరవొదలి వెళ్ళి పోయినాడు. (అని వూరుకొమ్మని సాయిబుతో సంజ్ఞ చేయును)
గురుజాడలు
485
కొండుభొట్టీయము