పుట:Gopinatha-Ramayanamu1.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పుండరీకవనబంధుండునుంబోలెఁ దేజరిల్లుచు లక్ష్మణభరతశత్రుఘ్నుల నవలో
కించి.

172


ఉ.

వీరిమనోజ్ఞవేషములు వీరివచోరచనాచమత్కృతుల్
వీరివిలాసవైఖరులు వీరిమృదుస్వరకల్పనంబులున్
వీరికళాకలాపములు వీరిసమంచితగానసాహితుల్
చారుతరంబు లై ముద మొసంగుచు నున్నవి మీరు వింటిరే.

173


చ.

సరసవిచిత్రశబ్దపదసంగత మై కడువిశ్రుతార్థ మై
సురుచిరరక్తిఁ దంత్రిలయశోభిత మై మధురాంచితాయత
స్వర మయి పొల్చుమామకరసస్ఫుటదోశ్చరితప్రబంధముం
గర మనురక్తిఁ బాడెదరు కంటిరె యీసుకుమారసుందరుల్.

174


క.

మానసహర మై కర్ణపు, టానందం బై సుధాభ మై మధురం బై
యీనవ్యకథాగానం, బానందబ్రహ్మ మయ్యె నాలించితిరే.

175


వ.

అని పలికి యమందానందకందాయమానమానసుం డై రాముండు ముఖార
విందంబునకు మందహాసంబు చెలు వొసంగ సుమిత్రానందనాదు లభినందింపఁ
దక్కథాశ్రవణకుతూహలపరుండై మెల్లన సింహాసనంబు డిగ్గి సభామధ్యంబున
నాసీనుండై తత్సభాసదనంబు నెల్ల నలంకరింపంజేయుచు.

176


చ.

సురుచిరమూర్తుల న్భువనసుందరుల న్మునివేషధారులన్
వరనృపలక్షణాఢ్యుల దివాకరతేజుల దివ్యబోధసు
స్థిరుల సమానరూపులఁ గుశీలవులం గని మాకు వేడ్క న
న్నిరుపమకావ్యరాజకథ నే ర్పలర న్వినిపింపుఁ డింపుగన్.

177


వ.

అని పలికి సభాసదుల నందఱ విలోకించి మహానుభావు లగునీకుమారులు పార్థివ
లక్షణలక్షితులయ్యు మునులై కుశీలవులయ్యు మహాతపస్వు లై యొప్పుచున్న
వారు వీరివలన శ్రేయస్కరం బైనమదీయచరితంబు వినుండని పలికె నంత నా
రాజనందనులు సభామధ్యంబున విపంచిక లలవరించి ఘనరక్తిరాగంబు లెఱింగి
కాలంబు వీక్షించి మధురస్వరజాతు లేర్పఱిచి సార్వత్రికం బైనమార్గంబును
గ్వాచిత్కం బైన దేశీయంబునుం దెలిసి మధురంబును మనోహరంబును రంజ
నంబును స్వేచ్ఛానురూపస్వరాయామంబును దంత్రీలయవంతంబును బ్రసిద్ధా
ర్థంబును మనస్సంహ్లాదజనకంబును శ్రోత్రేంద్రియముఖకరంబును సకలవిద్వజ్జన
సేవ్యంబు నగు శ్రీమద్రామాయణమహాకావ్యంబు గానంబు సేయ నుపక్రమించి
కావ్యముఖంబునం దాశీర్నమస్క్రియావస్తునిర్దేశంబు లావశ్యకంబు లని యా
లంకారికోక్తి గలుగుటం జేసి రామరూపవస్తునిర్దేశపూర్వకంబుగా ని ట్లని చదు
వం దొడంగిరి.

178