పుట:Gopinatha-Ramayanamu1.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కలశం బచ్చటఁ బెట్టుము, తలఁగక వల్కలముఁ దెమ్ము తమసాతటినీ
జలమజ్జన మొనరించెద, మలఘుగుణా సాంధ్యకృత్య మది దీర్చుటకున్.

129


క.

అని పలుక భరద్వాజుఁడు, ఘనముగ వల్కల మొసంగఁ గైకొని ఘనుఁ డ
మ్ముని తత్తీరవనంబున, వినుతతపోధనుఁడు వేడ్క వీక్షించు నెడన్.

130


మ.

హరిదళస్ఫుటవర్ణతుల్యనవదూర్వాంకూరకాంతిచ్ఛటా
భరితస్ఫీతవిశాలశాద్వలచరత్పంచాస్త్రకేళీవినో
దరసోన్మత్తమనోజ్ఞనాదశకునద్వంద్వంబు క్రీడింపఁగాఁ
దరులం బొంచి నిపాదుఁ డొక్కఁ డలుకన్ దర్పాంధుఁ డై గ్రక్కునన్.

131


క.

మించినవేడ్క రమించెడు, క్రౌంచంబుల రెంటిలోనఁ గనుఁగొని పురుష
క్రౌంచమును జంపె నురవడి, వంచించి నిషాదుఁ డెంత పాపాత్మకుఁడో.

132


వ.

అప్పుడు శోణితపరీతగాత్రంబుతో వివేష్టమానుండై నేలం బడి యున్ననిజ
వల్లభుం జూచి భర్తృమరణశోకాక్రాంతయై సహచరి యగుక్రౌంచాంగన దీన
స్వనంబునఁ గరుణంబుగా విలపించిన.

133

వాల్మీకిమహర్షి క్రౌంచమును సాధించిన నిషాదుని శపించుట

ఉ.

ఆరవ మాలకించి ముని యద్దెస ఘోరనిషాదపాతితుం
డై రస వ్రాలి యున్న విహగాధిపు రక్తపరీతశీర్షుని
న్వారక గాంచి భూరికరుణ న్మధురోక్తి ననూనయించి యౌ
రౌర యధర్మ మింత తగునా యని బుద్ధిఁ దలంచి యి ట్లనున్.

134


శ్లో.

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః,
య త్క్రౌంచ దేశ మవధీః కామమోహితమ్.


మ.

అని యి ట్లామునిరాజు పల్కినఁ దదీయాలాపముల్ శ్లోక మై
తనరం గ్రౌంచవిధంబుఁ గాంచి నగచేతం దూలు నాచేతఁ జ
య్యన నీలక్షణయుక్తపద్య మెటు లాహా వ్యాహృతం బయ్యె నేఁ
డని చింతించుచు శిష్యునిం బిలిచి నెయ్యం బొప్పఁగా నిట్లనున్.

135


వ.

క్రౌంచీశోకార్తుండనై యిప్పు డేను నిషాదుని శపించిన శాపోక్తి చతుష్పాద
యుక్తం బై సమాక్షరపదం బై లక్షణోపేతం బై యనేకార్థప్రతిపాదకం బై తం
త్రీలయసమన్వితం బై శ్లోకరూపం బయ్యె శ్లోకంబుకంటె నన్యం బైన కేవల
పదసందర్భంబు గాదు వింటివే యని పలికిన నా భరద్వాజుండు వాల్మీకివచ
నంబు విని హృష్టచిత్తుం డై బహుప్రకారంబుల నుత్తమం బైనయాశ్ల్లోకరా
జంబుఁ బఠించిన సంతుష్టాంతరంగుం డై.

136


తే.

సత్వరంబుగ వాల్మీకిసంయమీంద్రుఁ డన్నదీపుణ్యజలమున నర్హభంగి
స్నాన మొనరించి యిదియె మంత్రంబు గాఁగ, నచలభక్తి జపించుచు నచటు వాసి.

137