ద్వాదశగాథ
విజయధ్వానం
1
వారముదినములు కాకతీయవీరులు, వీరభద్రులు, రెడ్డిభీములు, వెలమార్జునులు, మున్నూరు రాములు, బ్రాహ్మణ పరశురాములు, ముదిరాజు హనుమంతులు, బోయాంగదులు, గొల్ల బలరాములు ఎడతెరపిలేకుండా, సర్వకాలాలయందు యాదవసైన్యాలపై విరుచుకుపడి నాశనం చేసిరి. ముక్కలుచేసి నుగ్గునుగ్గుగా భస్మము సలిపినారు. చాళుక్య వీరభద్రుడు యుద్ధంలో ప్రాణాలు మరచిపోయి ఉద్ధతసత్వుడై దుర్నిరీక్ష్యపరాక్రముడై యాదవులను ముక్కలు చేస్తున్నాడు.
వారముదినా లయినవెనుక రుద్రదేవి తన సర్వసైన్యాలకు రెండు దినాలు విశ్రాంతి అని ఆజ్ఞ దయచేసినది.
కోటలోనుండి ఒత్తిడి లేకపోవడంవల్ల యాదవసైన్యాలను కొంచెము ‘అమ్మయ్యా’ అని గాలి పీల్చుకునే అదను దొరకినది. ఈ పదిదినాల యుద్ధానికి యాదవులు మూడులక్షలమంది ముక్కలయిపోయినారు. రెండు లక్షలమంది మృతులయినారు. గాయాలు తగిలినవారు ఎనభైవేలున్నారు. తక్కినవారు శత్రువులకు బందీలయినారు.
గోన గన్నారెడ్డి యాదవులకు దేవగిరినుండి ఆహారసామాగ్రులు రానివ్వడు. దేవగిరికి మహాదేవరాజు పంపిన చారుల నందరినీ దారిలోనే బందీలుగా పట్టుకొని శత్రువుల వార్తలన్నీ అందిపుచ్చుకొని ఆనందిస్తూ మహాదేవరాజు సైన్యాలను చిందరవందర చేయుచుండెను.
మల్యాల కాటయచమూపతి బలగాలకు, మల్యాల గుండయ మహారాజు వాహినులకు గన్నారెడ్డే ముఖ్యనాయకుడైన ఆ పదిదినాలు అతడు నడిపిన యుద్ధవ్యూహవిధానము వర్ణనాతీతము.
ఒక దినాన బళ్ళను ముందుపెట్టి ఎద్దులు లేకుండా బళ్ళను తోసుకుంటూ ఆతడు సైన్యాలను నడుపుతూ వెళ్ళినాడు. విరోధులకు ఈ బళ్లేమిటో ఆ చీకటిలో అర్ధముకాలేదు. గన్నయ్య అధర్మయుద్దం చేయలేడు. కాబట్టి తన సైన్యాలనుండి ‘గోన గన్నారెడ్డికి జై’ అని కేకలు వేయించాడు.
ఆ కేకలతో యాదవమూకలు భయపడి ఆ చీకటిలో దొరికిన ఆయుధములతో గన్నారెడ్డిపై విరుచుకుపడవలెనని ప్రయత్నము చేసిరి. కాని చక్రములో