పుట:Geetha parichayam Total Book.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హేతుబద్దమైనదని, అందులోని విషయములు సిద్ధాంతపరమైన శాసనములని చెప్పుట మావంతయినది.

సంజయునికి సంబంధములేదని చెప్పడముతో భగవద్గీత నిజముగ భగవద్గీతయే అగును. మధ్యలో సంజయ గీత కాదు. దీనితో భగవద్గీత పెద్ద మలుపు తిరిగినట్లగును. ఇంత పెద్ద మలుపు త్రిప్పితే గాని చిక్కులుగల్గు తప్పుదారి వదలి, ఆటంకములు లేని మంచి దారిలోనికి కలుసుకోలేము. అందువలన పాఠకులు కడు జాగ్రత్తగా సత్యాసత్యములను యోచించి తెలుసుకోవాలని కోరుచున్నాము.

ఇప్పుడొక విప్లవాత్మకమైన ప్రశ్న వేసుకొందాము. అది ఏమనగా! భగవంతుడు చెప్పినది భగవద్గీత అని అర్థముగదా! అలాంటపుడు మనము చదువుచున్న భగవద్గీత 18 అధ్యాయములుగ ఉన్నది. అందులో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగముతో మొదలైనది. అర్జున విషాదయోగము కూడ భగవద్గీతయేనా! లేక కాదా? దీనికి సమాధానము చూస్తాము.

ఒక డాక్టరు, ఒక రోగి మాట్లాడుకొనుచున్నారనుకొందాము. రోగి తనకున్న రోగమును గూర్చి చెప్పగ, డాక్టరు రోగనివారణకు కావలసిన మందులు పత్యములు జాగ్రత్తలు మొదలగున్నవన్ని చెప్పాడనుకొందాము. ఇప్పుడు దేనిని వైద్యమంటాము? డాక్టరు చెప్పిన విషయమును మాత్రమే వైద్యమంటాము కదా! రోగి చెప్పిన దానిని వైద్యమనము కదా! అలాగే అర్జునున్ని రోగి అనుకుందాము. శ్రీకృష్ణున్ని వైద్యుడు అనుకుందాము. అలాంటపుడు శ్రీకృష్ణుడు చెప్పినదే వైద్యముగాని, అర్జునుడు చెప్పినది వైద్యము కాదుకదా! అర్జునుడు తనలోనున్న అజ్ఞానమనే రోగాన్ని బయట పెట్టినపుడు, జ్ఞానమనే వైద్యమును శ్రీకృష్ణుడు చెప్పినపుడు, ఆ విషయమునకు వైద్యమని పేరుపెట్టితే, అది కేవలము శ్రీకృష్ణుని మాటలకే వర్తించాలి. కురుక్షేత్ర యుద్ధమున అర్జునుడు తనలోని విషాదమును బయట పెట్టగా, సర్వదుఃఖములను పోగొట్టు జ్ఞానమును శ్రీకృష్ణుడు చెప్పాడు. అపుడు ఆయన మాటలకే భగవద్గీతయను పేరు కల్గినది.