చెప్పు కథలో బూచోని పాత్ర ఎంత అసత్యమో, గీతలో సంజయ ధృతరాష్ట్రుల పాత్రలు మరియు 700 శ్లోకముల పొడవు అంతే అసత్యమగును.
కొందరు పెద్దలు తమ జ్ఞానమును పుస్తక రూపములో వ్రాయునపుడు దానినెట్లు చెప్పవలెనని యోచించి, ఎట్లు చెప్పితే ప్రజలు నమ్మగలరని ఆలోచించి, కొన్ని పాత్రలు కల్పించి, వారి సంభాషణ రూపములో వ్రాశారు. ఉదాహరణకు అటువంటివే "సీతా రామాంజనేయ సంవాదము", "శ్రీకృష్ణరుక్మిణీ సంవాదము", "శివపార్వతి సంవాదము", "గురుశిష్య సంవాదము" మొదలగునవి గలవు. ఇలా ఎన్నో సంవాదరూపముగ వ్రాయబడియున్నాయి. కాని నిజముగ సీత రామాంజనేయులు, శ్రీకృష్ణరుక్మిణీలు మాట్లాడలేదు. అట్లే శివపార్వతులు, గురుశిష్యులు మొదలైన పాత్రలన్ని కల్పితమేనని తెలియాలి. అలాగే సంజయ ధృతరాష్ట్రులు కూడ కల్పితమే అగుదురు.
ఇపుడు భగవంతుడు చెప్పిన గీత వ్యాసునికెలా తెలిసిందను ప్రశ్న కూడ రాగలదు. మరియు గీతను వ్యాసుడు ఎవరి ద్వారా తెలుసుకొన్నాడన్న ప్రశ్న కూడ రాగలదు. దానికి మా సమాధానమేమనగా సావధానముగ పరికించి చూచితే శ్రీకృష్ణుని ద్వార తెలుసుకొన్న అర్జునుడే తాను తెలుసుకొన్న విషయమును యుద్ధానంతరము కొంత కాలమునకు వ్యాసునికి స్వయముగ తెలిపియుండాలి. అర్జునుని ద్వార తెలుసుకొన్న విషయమును పాత విషయమనిపించనట్లు, అపుడే జరుగుచున్న తాజా విషయమన్నట్లు, సంజయ ధృతరాష్ట్రుల పాత్రలు కల్పించి వ్యాసుడు వ్రాశాడు. అలా వ్యాసుడు వ్రాయుట వలన ఎవరికీ అనుమానము రాలేదు. ఆలోచించని బోధకులు కూడ అలాగే చెప్పుచు పోయారు. ప్రజలంతా అదే నిజమనుకొన్నారు. కాని యోచించు కొందరికి మాత్రము గీత అడ్డగీతగ తోస్తున్నది. ఆలోచించు వారికి కొంత అసత్యము అందులో కనిపిస్తున్నది. జ్ఞానదృష్ఠి కల్గిన వారికి గీతరూపమే వేరుగ కన్పిస్తున్నది. వారందరు ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో తెలియక నాస్తికులుగ మారజొచ్చారు. ఇటువంటి అర్థముకాని సమయములో గీత సత్యమైనదని,