పుట:Geetha parichayam Total Book.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా బోధలు ప్రపంచ విషయములకు ఏమాత్రము ఉపయోగపడవు. కావున నేటి ఆశల వాతావరణములో మా బోధలకు ఆదరణ చాలా తక్కువని కూడ మాకు తెలుసు. అయినప్పటికి సత్యమునే తెల్పి మానవులను శాశ్వతమైన మోక్షప్రాప్తిని ఆశించునట్లు చేయాలని మా ఆకాంక్ష. మా బోధల వలన అందరు కాక వేయింటికొకడు మోక్షాసక్తుడైన మా కృషికి ఫలితము చేకూరినట్లే, మా ఉద్దేశ్యము నెరవేరినట్లే.

గీత అంటే ఒక రేఖ అనియు, మానవాళికి ఒక హద్దును చూపున దనియు, మానవాళికందరికి పనికి వచ్చునదేననియు చెప్పారు. కాని ఫలానమతము వారికని పేరుపెట్టి చెప్పలేదు. అందువలన గీత విశ్వ మానవులందరి నిమిత్తము శాసన రూపముగనున్న శాస్త్రమని తెలియవలెను. అందులో తెలిపిన విషయములు మానవ జాతికంతటికి ఉపకరించునప్పటికి, గీత కేవలము హిందువులకేనని మిగతా మతముల వారనుకోవడము శోచనీయము. బహుశ చెప్పిన వానిని బట్టి అతను ఆ దినము ఏ మతమువాడో, ఆ మత సంబంధమైనదేనని కొందరనుకొని, గీతను ఒక్క హిందూమతమునకే పరిమితము చేసియుండవచ్చును. భగవద్గీత ప్రకటితమైన ఐదువేల నూటాయాభై సంవత్సరముల క్రితము,ఏ ఇతర మతములేదని ముఖ్యముగ గమనించినట్లయితే, గీత ఇప్పుడున్న అన్ని మతముల మానవులకని సులభముగ తెలియగలదు. అందులోని విషయములు జన్మించిన జీవునికని ఉండుట వలన, అన్ని మతముల వారు జన్మించిన జీవులే అయినందువలన, ఆ విషయములు సమస్త మానవాళికి సంబంధించినవని తెలియుచున్నది. ఇంకనూ పరికించి చూచినట్లయితే అందులో స్త్రీ,పురుష భేదములు లేక కేవలము ఆత్మ పరముగ చెప్పబడియున్నదని తెలియుచున్నది. అటువంటప్పుడు ఒక కులమని, ఒక మతమనియేకాక, స్త్రీ పురుషుల భేదము కూడ లేకుండ గీతను తెలుసుకొనవచ్చునని తెలియుచున్నది. బైబిలు క్రైస్తవులకన్నట్లు, ఖురాన్‌ మహ్మదీయులకన్నట్లు, భగవద్గీత హిందువులకేనని చాలామంది భావిస్తున్నారు. బైబిలులో క్రైస్తవులపేరు,